కొడంగల్, జూన్ 29: కొడంగల్ నియోజవర్గానికి పది కిలోమీటర్ల దూరం..ఎన్హెచ్ 163 హైవేరోడ్డుకు అతి చేరువలో చుట్టూ పొలాల మధ్య పచ్చటి వాతావరణంలో చిన్న నందిగామ గ్రామపంచాయతీ ఉంది. అప్పట్లో చెత్త కుప్పలు..మురికిగుంతలు.. మురు గునీటితో నిండుకున్న రోడ్లు వంటి పరిస్థితి కనిపించేది. కానీ, నేడు పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపం మారిపోయి, స్వచ్ఛతతో వెల్లివిరిస్తూ..అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. చిన్ననందిగామ గ్రామ పంచాయతీలో చిన్ననందిగామతో పాటు బుర్జుగాన్ పల్లి ఉంది.గ్రామంలో మొత్తం 1565 మంది జనాభా ఉండగా, 1004 మంది ఓటర్లు. 319 కుటుంబాలు ఉన్నాయి.
గ్రామానికి నీటి సరఫరా కోసం రెండు మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఏదైనా అంత రాయం ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో నీటిని సరఫరా చేసేందుకు బోర్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండేదికాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవతో బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది. గ్రామానికి వెళ్లే ముందు పచ్చటి పంట పొలాలతో కూడిన ఆహ్లాదకర వాతావరణంతో పాటు బీటీ రోడ్డు పొడవునా హరితహారం కింద నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి రోడ్డుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మండలానికో చిట్టడివిని తలపించేలా ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొడంగల్ మండల పరిధిలో చిన్ననందిగామ గ్రామంలో కూడా బృహత్ పల్లె ప్రకృతి వనం రూపుదిద్దుకొంటున్నది. గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో 10 ఎకరాలు కేటాయించి 23వేల మొక్కలను పెంచే ప్రణాళిక అమలులో ఉంది. కాగా ఈ సంవత్సరం 13వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
గతంలోని మురికి కుంటను పూర్తిగా శుభ్రం చేసి ఆ ప్రదేశంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం.నేడు మొ క్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం సంతరించు కున్నది. దేవాలయ సమీపంలోనే పల్లె ప్రకృతివనం ఉం డడం ఆనందంగా ఉంది. వైకుంఠ ధామ నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది . ఈ హరితహారంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
– సావిత్రమ్మ, సర్పంచ్, చిన్ననందిగామ