కోట్పల్లి, జూన్ 18 : ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో వసతులను కల్పిస్తున్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మన ఊరు-మన బడి అంశంపై ఎంపిక చేసిన మండల విద్యాధికారి చంద్రప్ప, సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లతో తెలంగాణ పాఠశాలల డైరెక్టర్, కమిషనర్ దేవసేన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రైవేటుకు దీటుగా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా ప్రభుత్వ బడులను అన్ని హంగులతో వసతులను కల్పించి విద్యార్థులకు విద్యనందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, ఉచిత మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత దుస్తులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరిన పాఠశాలను మండలాల వారీగా ఎంపిక చేశామని, రూ.5 లక్షల వరకు ఉన్న వరకు ఎస్ఎంసీ చైర్మన్లు పనులను చేయించాలని సూచించారు. 30 లక్షల పనులకు టెండర్ల ద్వారా కాంట్రక్టర్లను పిలిచి పనులను చేయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు సావిత్రి దశరథ్గౌడ్, వెంకటేశం, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.