సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్ర మం శనివారంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లాలో ఐదోవిడుత పల్లెప్రగతి, నాల్గో విడుత పట్టణ ప్రగతి పనులు చేపట్టగా గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రమదానంతో గ్రామాల్లోని రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ‘పల్లెప్రగతి’లో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 5,809 కిలోమీటర్ల మేర రోడ్లు, 3,499 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు, 7,225 ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేశారు. అదేవిధంగా 987 శిథిలావస్థకు చేరిన ఇండ్లు, గుంతలను పూడ్చివేశారు. 2,717 ముళ్ల పొదల తొలగింపుతోపాటు 587 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 107 కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో శ్రమదానం నిర్వహించగా ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైకుంఠధామాల్లో విద్యుత్, నీటి, మరుగుదొడ్ల వంటి వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రంగారెడ్డి, జూన్ 18, (నమస్తే తెలంగాణ): పల్లెలన్నీ స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈనెల 3 నుంచి పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభంకాగా.. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో చేపట్టిన కార్యక్రమాలతో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై పారకుండా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి కుటుంబం మ్యాజిక్ ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించారు. పవర్ హాలీడేను నిర్వహించి పంచాయతీల్లో విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించారు. డంపింగ్యార్డు, వైకుంఠధామాన్ని సందర్శించడం, గ్రామస్తుల సహకారంతో శ్రమదానం నిర్వహించి కలుపు మొక్కలను తొలగించారు. గ్రామాల్లో పాడుబడిన బావులు, నిరూపయోగ బోరుబావులను పూడ్చివేయడంతోపాటు గ్రామాల్లో కాలువ గట్లు, చెరువు గట్లకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటారు. పల్లెప్రగతి కార్యక్రమం చివరి రోజున గ్రామసభ నిర్వహించి పదిహేను రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతోపాటు గ్రామాలు ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, మోడల్ అర్హత సాధించిన గ్రామాల వివరాలను గ్రామసభలో ప్రకటించారు. పదిహేను రోజులపాటు పల్లెప్రగతిలో అత్యుత్తమ సేవలందించిన అధికారులు, అనధికారులను ప్రజాప్రతినిధులు సన్మానించారు.
పల్లెల్లో ఎంతోమార్పు..
ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో ఎంతో మార్పు వచ్చింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టిన శ్రమదానం కార్యక్రమంతో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. అంతేకాకుండా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని 5809 కిలోమీటర్ల మేర రోడ్లు, 3499 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు, 7225 ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేశారు. అదేవిధంగా 987 శిథిలావస్థకు చేరిన ఇండ్లు, గుంతలను పూడ్చివేశారు. 2717 ముళ్ల పొదలను తొలగించడంతోపాటు గ్రామాల్లోని రహదారులపై ఉన్న 1221 గుంతలను మట్టితో పూడ్చివేశారు. అదేవిధంగా భూగర్భజలాలను పెంపొందించేందుకుగాను వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించగా, జిల్లాలో 587 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 107 కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా 23 పాడుపడిన బావులు, నిరూపయోగ బోర్లను పూడ్చివేశారు. అంతేకాకుండా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో శ్రమదానం నిర్వహించారు. 34,395 మంది ప్రజాప్రతినిధులు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లాలోని 57 వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం, 27వైకుంఠధామాలకు నీటి సౌకర్యం, 29 వైకుంఠధామాల్లో మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవైపు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటడంపై ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 410 కిలోమీటర్లలో అవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు గుర్తించారు. అదేవిధంగా 35 బృహత్ పల్లెప్రకృతివనాలకు స్థలాలను గుర్తించారు. పల్లెప్రగతిలో భాగంగా రెండు రోజులపాటు పవర్ హాలీడే కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా అంతటా విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా 172 వంగిన, నేలకొరిగిన స్తంభాలను సరిచేయడం, 119 స్తంభాలకు లూజ్ వైర్లను సరిచేయడం వంటి కార్యక్రమాలను పూర్తి చేశారు. అదేవిధంగా పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలను బాగు చేసేందుకుగాను ఇద్దరు దాతలు ముందుకురాగా రూ.5.25 లక్షలను విరాళంగా అందజేశారు. మరోవైపు ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, యెగ్గే మల్లేషం, దయానంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, జడ్పీటీసీలు, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో, డీపీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల రూపురేఖలు మారాయి
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టిన శ్రమదానం, రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలతో గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. ఐదో విడుతలో ప్రధానంగా వైకుంఠధామాల్లో విద్యుత్, నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంపై దృష్టి పెట్టి పూర్తి చేశాం. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా గుర్తించిన విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించాం. గ్రామాలతోపాటు పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీలు కూడా స్వచ్ఛతతో కూడిన మున్సిపాలిటీలుగా తయారయ్యాయి.
– డి.అమయ్కుమార్,కలెక్టర్