పరిగి, జూన్ 18 : ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో తెలంగాణ పల్లె సీమలు స్వచ్ఛ గ్రామాలుగా మారాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కలెక్టర్ నిఖిలతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పరిగి పట్టణంలో రూ.2కోట్లతో నిర్మాణం చేపట్టనున్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, మార్కెట్యార్డులో సీసీ రోడ్లు, ప్రహరీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. దోమ మండలకేంద్రంలో రూ.కోటీ 30లక్షలతో నిర్మించిన కేజీబీవీ ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.22లక్షలతో నిర్మించిన సైన్స్ల్యాబ్, అదనపు గదులను మంత్రి ప్రారంభించారు.
పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, గతంలో ఒక బోరు వేయాలంటే, కాలిపోయిన వీధిదీపాలు వేయాలంటే నిధుల కోసం నానా యాతన పడేవాళ్లమని, పంచాయతీ సిబ్బందికి జీతాలు సైతం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్యార్డ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆడబిడ్డ పెండ్లికి సర్కారు సాయం ప్రభుత్వం లక్షా 116 అందిస్తుందని అన్నారు. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఎదురుచూడకుండా ఎకరాకు సంవత్సరానికి రూ.10వేల చొప్పున రూ.50వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.
సర్కారు బడుల్లో సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు సుమారు రూ.100కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించామన్నారు. విద్యార్థులకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీలో ఇంగ్లిష్, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు ఉండేలా పాఠ్య పుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాల్సిందిగా మంత్రి సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో ఒకటో తరగతి విద్యార్థిని ప్రియాంకతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయులు ఏమి చెబుతున్నారని మంత్రి అడుగగా ఏబీసీడీలు చెబుతున్నారని విద్యార్థిని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కనీసం నెలకు ఒకసారి పాఠశాలకు వచ్చి తమ పిల్లలు ఎలా చదువుతున్నారని తెలుసుకోవాలని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో బీపీ, షుగర్ మందులు ఉచితంగా అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. వివిధ రకాల వైద్య పరీక్షలు సైతం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సర్కారు దవాఖానలకు వెళ్తే శాంపిల్స్ సేకరించి వికారాబాద్లోని డయాగ్నస్టిక్ సెంటర్కు పంపించడం జరుగుతుందని, 24 గంటల్లో వైద్య పరీక్షల ఫలితాలు వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా సర్కారు నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో అనేక గ్రామాలు సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పల్లె ప్రకృతివనాలతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పరిగిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణంతో ఒకే దగ్గర కూరగాయలు, పండ్లు, నాన్వెజ్ కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీఆర్వో విజయకుమారి, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, ఎంపీపీలు కరణం అరవిందరావు, అనసూయ, మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్లు శ్యాంసుందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీలు కె.సత్యనారాయణ, మల్లేశం, మహిపాల్రెడ్డి, సర్పంచ్లు రాజిరెడ్డి, లక్ష్మీదేవి, పెంటమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.