నవాబుపేట, జూలై 9 : నవాబుపేట మండలంలో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. మండలంలోని 32 గ్రామపంచాయతీల్లో ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల గుంతలను సైతం తీయించి మొక్కలను నాటగా, రెండు, మూడు రోజులుగా మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు, ఖాళీ స్థలాల్లో వేప, గుల్మొహర్, అల్లనేరేడు, బాదం, టేకు తదితర రకాల మొక్కలను విరివిగా నాటుతున్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతమయ్యేలా ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా, సర్పంచ్లు, సెక్రటరీలు పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. నాటిన ప్రతి మొక్కను మన ఇంట్లో పిల్లల్లా సంరక్షించాలని అధికారులు ప్రతి పల్లెలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్లు గ్రామస్తుల సహకారంతో పాటు కూలీలను ఏర్పాటు చేసుకుని నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలను పంచాయతీ సెక్రటరీ నిత్యం పర్యవేక్షిస్తుండగా, మొక్కలకు నీళ్లు పట్టడడంతో పాటు కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. ఏడు విడుతల్లో నాటిన మొక్కలు నేడు వృక్షాలు కావడంతో పల్లెల్లో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రవాదారులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
హరిత ఫలం..
మండలంలోని పంచాయతీల ఆవరణల్లో తొలి విడుతలో నాటిన పండ్ల మొక్కలు ఫలాలనిస్తున్నాయి. జామ, మామిడి, అల్లనేరేడు, చింత తదితర మొక్కలు కాత కాస్తున్నాయి. యెల్లకొండ, అర్కతల, అక్నాపూర్, ఏక్మామిడి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లల్లో పండ్ల మొక్కలు ఫలాలిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు..
నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ సిబ్బంది నిత్యం మొక్కలకు నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటున్నాం. పల్లెప్రకృతి వనాలకు ప్రహరీలను ఏర్పాటు చేయిస్తున్నాం. ఎనిమిదో విడుత హరితహారం విజయవంతమయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మీదేవి, ఏపీవో
పల్లెల్లో పచ్చదనం
ఏడు విడుతల్లో నాటిన మొక్కలతో మండలంలోని ప్రతి పల్లెలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం మండలంలో జోరుగా సాగుతున్నది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుంది.
– రావుగారి వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు