మంచాల, జూన్ 18 : పల్లెప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని అభివృద్ధికి సహకరించడంతో భేష్గా ఉందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. పల్లెప్రగతి గ్రామ సభల్లో భాగంగా శనివారం మంచాల మండలం ఆగపల్లి, తిప్పాయిగూడ, నోముల గ్రామాల్లో గ్రామ సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రకృతి వనాలు, వన నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మంచాల మండలంలో 23గ్రామ పంచాయతీల్లో క్రీడాస్థలాలను గుర్తించడమే కాకుండా పనులను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిథుల పనితీరు బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, ఎంపీడీవో శ్రీనివాస్, వివిద గ్రామాల సర్పంచ్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మండలంలో పర్యటన..
యాచారం, జూన్18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు భేషుగ్గా ఉన్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతి పనులు శనివారంతో ముగియడంతో ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి దళితబంధు పథకంపై ఆరా తీశారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారా, లేదా అని ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే రూ. పది లక్షలు వృథా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మండలంలో పల్లె ప్రకృతివనాలన్నీ చిట్టడవుల్లా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం గడ్డమల్లాయగూడ గ్రామంలో ఆయన పర్యటించి క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. మండలంలోని అనుబంధ గ్రామాలతో పాటుగా ప్రతి గ్రామపంచాయతీకి ఒక క్రీడా మైదానాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. క్రీడా మైదానాలన్నంటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పల్లె ప్రగతి పనులు బాగున్నాయన్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జిల్లాపరిషత్ సీఈవో దిలీప్కుమార్, ఎంపీడీవో విజయలక్ష్మి, మండల స్పెషల్ ఆఫీసర్ జంగారెడ్డి, ఎంపీవో ఉమారాణి, ఏపీఎం లింగయ్య, ఈసీ శివశంకర్, సర్పంచ్లు నర్సిరెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.