ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 19 : రెండో విడుత కంటివెలుగు కార్యక్రమంలో వైద్యులు అంకితభావంతో పనిచేసి పరీక్ష కేంద్రాలకొచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం, తులేకలాన్ గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యసిబ్బందితో మాట్లాడుతూ.. కంటివెలుగు కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో ప్రజలు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా సేవలందించాలన్నారు. రంగారెడ్డిజిల్లాలో 80 క్యాంపుల ద్వారా కంటివెలుగు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మొదటి రోజు కంటివెలుగు కేంద్రాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వైద్యులకు వివరించి వైద్య సదుపాయాలను పొందారన్నారు.
ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవసరమైన వారందరికి అక్కడికక్కడే కంటి అద్దాలను అందజేశారని.. ఆపరేషన్లు అవసరమైన వారిని కూడా గుర్తించి వారిని ఆపరేషన్ల నిమిత్తం ఇతర ఆస్పత్రులకు పంపించే కార్యక్రమం కూడా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన కంటి అద్దాలు వచ్చాయన్నారు. ఎంతమందికైనా కంటి అద్దాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దండుమైలారం గ్రామంలో కంటివెలుగు కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్, వైద్యసిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి కలెక్టర్ను కోరారు. నిధుల మంజూరుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్, సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపీటీసీలు నాగటి నాగమణి, అరుణమ్మ, అనసూయ, తహసీల్దార్ రామ్మోహన్రావు పాల్గొన్నారు.