షాద్నగర్రూరల్, మార్చి 3 : ద్వాపర యుగం నాటి రామేశ్వరంలో ఉన్న ఉత్తర రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రతి సోమవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
షాద్నగర్ నుంచి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో, జాతీయ రహదారి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉత్తర రామలింగశ్వేర స్వామి ఆలయం ఉన్నది. జాతీయ రహదారిపై ఆలయ ముఖద్వారం కలదు . షాద్నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ముఖద్వారం నుంచి ప్రైవేటు ఆటోలు ఉంటాయి.
ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనుండడంతో అన్ని మౌలిక వసతులను సమకూర్చనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని మౌలిన వసతులను సమకూర్చనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంచినీటి వసతి, వైద్య సదుపాయం, బారికేడ్లు, సేద తీరేందుకు చలువ పందిర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కుండీలను ఏర్పాటు చేశారు. మంచినీటి ట్యాంకులను అందుబాటులో ఉంచనున్నారు. క్యూలో ఉండే భక్తులకు మంచినీటిని అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కోనేటిలో నీటిని శుద్ధి చేసినట్లు వివరించారు. ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ను చల్లామన్నారు.
అలయ పరిసర ప్రాంతంలో సువిశాలమైన ప్రదేశాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేయనున్నారు. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. అలయ సమీపంలో తాత్కాలికంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 4న గణపతిపూజ, పుణ్యాహవాచనం, రుద్రహోమం, అంకుర్పాణం, ధ్వజారోహణం, 5న శివపార్వతుల కల్యాణం, 6న నందిసేవ, అగ్నిగుండాలు, 7న రుద్రాభిషేకం, 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, 9న రుద్రహోమం, పూర్ణాహుతి, 10న రథోత్సవం, 11న శివతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపకుడు, ధర్మకర్త రవీందర్రావు, వంశపారంపర్య అర్చకుడు ప్రహ్లాదాచార్యులు కోరారు.
భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని కేవలం స్వామివారి స్పర్శ దర్శనం మాత్రమే ఉంటుంది. స్పర్శ దర్శనానికి రూ.100, శీఘ్ర దర్శనానికి రూ.50, వీఐపీ దర్శనాలకు రూ.200 వసూలు చేయనున్నారు.
అలయానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని అన్ని మౌలిక వసతులు సమకూర్చనున్నాం. భక్తులు సేద తీరడానికి టెంట్లను ఏర్పాటు చేశాం. ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు తోడ్పాటునందించాలి. వలంటీర్లను నియమిస్తాం. ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహారా కాయనున్నారు. అందరికీ అర్థమయ్యేలా క్యూలైన్లలో సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. భక్తులు సమన్వయాన్ని పాటించి పోలీసులు, సిబ్బందికి సహకరించాలి.
– శివకుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి, రామేశ్వరం
ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే స్పర్శ దర్శనం మాత్రమే ఉంటుంది. భక్తుల సమన్వయంతో ఉండాలి. అందరూ సహకరించాలి. అనివార్య సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలి.
– వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు