రంగారెడ్డి, మే 5(నమస్తే తెలంగాణ) : పొరుగు రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు.. పవర్ హాలిడేస్తో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటే.. మన రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామికరంగం ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్న చందంగా వర్ధిల్లుతున్నది. సీఎం కేసీఆర్ చొరవతో విద్యుత్ కొరత అనేది లేకుండా నడి ఎండాకాలంలోనూ గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలూ కరెంట్ అందుతున్నది. 2014కు ముందు ఆంధ్రపాలకుల పెత్తనంలో తెలంగాణలో ఎడాపెడా విద్యుత్ కోతలు, వారంలో నాలుగైదు రోజులు పవర్ హాలిడేస్ విధించడంతో పారిశ్రామిక రంగం కుదేలైంది. అలాంటిది కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా మారింది. నేడు పరిశ్రమలు నిరంతరంగా ఉత్పత్తులను చేపడుతుండగా.. కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నది. దీంతో కంపెనీలు లక్ష్యానికి మించి టర్నోవర్ను సాధిస్తున్నాయి. దీంతో ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు క్యూ కడుతున్నాయి. సమైక్యరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో నెలకు కేవలం 64.94 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగగా.. ప్రస్తుతం 198.06 మిలియన్ యూనిట్లను వాడుతుండడం గమనార్హం.
ఒకప్పుడు విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్, మూతపడిన పరిశ్రమలు, ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇదీ పరిశ్రమలు, రైస్మిల్లులకు సంబంధించిన గత పరిస్థితి. కానీ నేడు పరిశ్రమలు లక్ష్యానికి మించి టర్నోవర్ను సాధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్ కోతలతో పరిశ్రమలను నడపలేక మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. వేసవి వచ్చిందంటే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మొదలుకొని భారీ తరహా పరిశ్రమల వరకు పవర్ హాలిడేస్ ప్రకటించి పరిశ్రమలను మూసివేసేవారు. ఐదారు నెలలపాటు పవర్ హాలిడేస్ ప్రకటించడంతో కార్మికులు రోడ్డున పడిన దయనీయ పరిస్థితులున్నాయి.
రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేసేవారు. వేసవిలో పరిశ్రమల్లో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయేది. ఎప్పుడు కరెంట్ వస్తదా అంటూ ఎదురుచూడాల్సి వస్తుండేది. రోజుల తరబడి రైస్మిల్లుల వద్ద తమ వడ్లను ఎప్పుడు పడ్తరోనని ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో వడ్లను తీసుకువచ్చి ఎదురుచూసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నాణ్యమైన విద్యుత్తు సరఫరాతోపాటు పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన మార్పులతో పారిశ్రామిక రంగంలో నూతన శకం మొదలైంది.
వంద యూనిట్లకుపైగా పెరిగిన విద్యుత్తు వినియోగం…
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం పారిశ్రామిక రంగంలో కొత్త విప్లవం మొదలైంది. విద్యుత్తు కోతలతో 2014కు ముందు మూతపడిన పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో పరిశ్రమలన్నీ పునఃప్రారంభం కావడం గమనార్హం. అయితే గతంతో పోలిస్తే పరిశ్రమల నిర్వహణతో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగినప్పటికీ వేసవిలోనూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. 2014కు ముందు జిల్లాలోని పరిశ్రమల నిర్వహణతో 64.94 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగించగా, నేడు 100 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగం పెరగడం గమనార్హం. గత నెలలో పరిశ్రమల నిర్వహణతో 198.06 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లాకు పరిశ్రమల క్యూ…
రాష్ట్ర ప్రభుత్వం 24గంటలపాటు విద్యుత్తు సరఫరా, పారిశ్రామికరంగానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యతతో జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహికులు క్యూ కడుతున్నారు. ఏరోస్పేస్ మొదలుకొని ఫార్మాసిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, అమెజాన్, విప్రో తదితర భారీ ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విద్యుత్తు సరఫరాతోపాటు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టడంతో త్వరలో అమెరికన్ పరిశ్రమలు కూడా జిల్లాకు రానున్నాయి. జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లాలో 3931పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
సంబంధిత పరిశ్రమలతో 5,04,170 మందికి ఉపాధి లభించింది. అదేవిధంగా టీఎస్-ఐపాస్తో పారిశ్రామికరంగానికి మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. టీఎస్-ఐపాస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన అనంతరం 1369పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ. 70,552 కోట్ల పెట్టుబడులురాగా, 9,51,197మంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. టీఎస్ ఐపాస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో సూక్ష్మతరహా పరిశ్రమలు-492, చిన్నతరహా పరిశ్రమలు-573, మధ్యతరహా పరిశ్రమలు-69, భారీ పరిశ్రమలు-107, మెగా తయారీ పరిశ్రమలు-26,మెగా మౌలిక పరిశ్రమలు-102 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
జిల్లాలో 33,091 పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు
పరిగి, మే 5 : తెలంగాణ రాకముందు వారానికి రెండు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే. కరెంటు కోసం ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తల ధర్నాలు… నేడు పక్క రాష్ర్టాల్లో సైతం పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఇది కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. సీఎం కేసీఆర్ ముందు చూపుతో విద్యుత్ రంగంలో అనేక మార్పులు తీసుకురావడంతోపాటు సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 33,091 పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కుటీర పరిశ్రమలు మొదలుకొని కోట్లాది రూపాయల టర్నోవర్ గల వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు పవర్ కట్ అనేది లేకుండా నిరంతరంగా సరఫరా జరుగుతుంది. గత ఆరున్నర ఏండ్లుగా నిరంతర విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు లేకుండా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీలు, ఇతర పెద్ద కంపెనీల్లో మూడు షిఫ్టులుగా పనులు కొనసాగుతుండటం గమనార్హం. తద్వారా కంపెనీల్లో పనిచేసే సిబ్బందికి చేతినిండా పని ఉంటుంది. తాండూరు ప్రాంతంలోని పాలిషింగ్ మిషన్లు
రైస్ మిల్లుల్లో నిరాటంకంగా పనులు…
24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో ప్రతిరోజూ రైస్మిల్లుల్లో మిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలో 59 రైస్మిల్లులు ఉన్నాయి. వాటిలో 56 రా రైస్మిల్లులు, 3 బాయిల్డ్ రైస్మిల్లులు ఉండగా.. ప్రస్తుతం నిరాటంకంగా మిల్లింగ్ జరుగుతుంది. గత వానాకాలం సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్మిల్లులకు కేటాయించడం జరిగింది. గతంలో కస్టమ్ మిల్లింగ్ చేయాలంటే కరెంటు ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నది. సీఎంఆర్ బియ్యం అందజేసే గడువు ముగియడంతో సాధ్యమైనంత త్వరగా కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంలో మిల్లింగ్ రాత్రీపగలు తేడా లేకుండా కొనసాగిస్తున్నారు.
మరోవైపు త్వరలోనే యాసంగి సీజన్కు సంబంధించిన వడ్లు సైతం కొనుగోలు చేపట్టి ప్రభుత్వం నేరుగా సీఎంఆర్ కోసం రైస్మిల్లులకు కేటాయించనున్నది. దీంతో గతంలో కేవలం సీజన్లోనే నడిచే రైస్మిల్లులు ప్రస్తుతం సంవత్సరం పొడవునా మిల్లింగ్ పనులు జరుగుతుండటంతో అందులో పనిచేసే వివిధ రాష్ర్టాలకు చెందిన వారికి చేతినిండా పని దొరుకుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ర్టాలకు చెందిన హమాలీలే జిల్లాలోని రైస్మిల్లుల్లో పనిచేయడం జరుగుతుంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారికి ఇక్కడ ప్రతిరోజూ పని లభించడానికి ప్రధాన కారణం నిరంతర విద్యుత్ సరఫరానే అని చెప్పవచ్చు.
గతంలో రోజూ నష్టమే
గతంలో వేసవి వచ్చిందంటే చాలు వారంలో కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు మాత్రమే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అయ్యేది. అంతేకాకుండా పరిశ్రమలకు పవర్ హోలిడే పేరిట వారంలో ఒక రోజు విద్యుత్ సరఫరాను నిలిపివేసేవారు. దీంతో పరిశ్రమను నడిపించకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయి పరిశ్రమకు సుమారుగా రూ.2కోట్ల నష్టం కలిగేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ పోతుందనే భయం లేకుండా పోయింది. ఎటువంటి పవర్ కట్ లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది. పరిశ్రమలో లోవోల్జేజీ సమస్య కూడా లేకుండాపోయింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నది.
–వి.వెంకటేశ్వరరెడ్డి, వినాయక స్టీల్ వైస్ ప్రెసిడెంట్, కొత్తూరు
విద్యుత్ సరఫరాలో తెలంగాణ నంబర్వన్
రైతుల నుంచి రైస్ మిల్కు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఫ్లోర్మిల్లో పట్టించాలి. విద్యుత్ ఉంటేనే అది సాధ్యమయ్యేది. కరెంట్ లేకపోయేసరికి రైతులు ధాన్యం బస్తాలను ఇంటికి తిరిగి తీసుకుపోలేక బస్తాలను రైతులు గోదాంలో, రైస్మిల్ ఆవరణలో పెట్టేవాళ్లు. గోదాంలో ఎలుకల బాధ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోతున్నారన్న మాటే లేకుండా పోయింది. దేశంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే.
– శివ సతీశ్గుప్తా, రైస్మిల్ యజమాని,
కొత్తూరు మండలం కరెంట్ సమస్య లేదు
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ను సక్రమంగా సరఫరా చేస్తుండటంతో మాలాంటి వారికి ఇబ్బందులు తొలగిపోయాయి. గతంలో మాదిరిగా విద్యుత్ సమస్యలు ఉంటే పనులు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పనులు సులువుగా చేసుకుంటున్నాం. విద్యుత్ ఉంటేనే పనులు ముందుకు సాగుతాయి.
–సింగారపు మురళి, శ్రీరామ బ్రిక్స్ ఇండస్ట్రియల్, వికారాబాద్
నా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చింది
గతేడాది నా బిడ్డ పెండ్లి చేశాను. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్షా 116 అందించింది. ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తిప్పలు పడే తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవడం సంతోషంగా ఉంది. రైతుబంధు పథకం ద్వారా నాకున్న ఐదెకరాల పొలానికి విడుతకు రూ. 25వేలు వస్తున్నాయి. కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కారు చెన్నయ్య, బోడంపహాడ్(షాబాద్)