షాబాద్ : రానున్న భవిష్యత్ ఆడపిల్లలదేనని బాలికలు వారి హక్కులు వినియోగించుకుని భవిష్యత్కు బాటలు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళవారం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంపై అధికారులు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న పై అధికారులకు తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ విద్యను నిర్లక్ష్యం చేయకూడద న్నారు. పిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆడపిల్లల విషయంలో అబార్షన్కు పాల్పడ్డా తమకు తెలియజేయాలన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యతో పాటు మంచి సంస్కృతి, సంప్రదాయాలతో మసలుకోవాలని దేశానికి గర్వకారణంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్య, సాంస్కృతిక, ఆటపాటల్లో ప్రతిభ కనబర్చిన వారికి మెమెంటోలు అందించి ఘనంగా సన్మానించడంతో పాటు సభకు హాజరై పిల్లలందరితో కలిసి ఇంటర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే కేకును కట్ చేశారు. కార్యక్రమంలో పిల్లల సంరక్షణ కమిటీ చైర్మన్ నరేందర్, సోషల్ వర్కర్ వాసు, డీసీపీ సలీమా, ఏసీపీ కిషోర్, ఎన్జీవో కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ అధికారులు, ఏడు ప్రాజెక్టుల కో-ఆర్డినేటర్లు, ఇతర అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.