కడ్తాల్ : మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేదివాడు గురువేనని, ప్రతి మనిషి నిత్య విద్యార్థేనని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురి గల మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న ధ్యాన మహా సభలు కొనసాగుతున్నాయి. మహా సభల్లో పదో రోజు గురువారం ఉదయం 5 నుంచి 8గంటల వరకు పత్రీజీ నిర్వహించిన ధ్యానంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి సుభాశ్ పత్రీజీ మాట్లాడుతూ మనిషికి శ్వాసయే గురువు అని, గురువును పట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం కూర్చుని ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. మనిషి విపరీతమైన ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురై అన్ని రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నాడని, మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడని పేర్కొన్నారు. శ్వాస మన ఆధీనంలో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
ధ్యానమనేది అద్భుతశక్తి అని, నిత్యం ధ్యాన సాధనతో జ్ఞానంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, గురువులు ధ్యానంలో తమ అనుభవాలను ధ్యానులతో పంచుకున్నారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు స్వర్ణమాల, సాంబశివరావు, హనుమంతరాజు, బాలకృష్ణ, శ్రీరాంగోపాల్, జయశ్రీ, రవిశాస్త్రి, శివప్రసాద్, మాధవి, సాగర్, ధ్యానులు పాల్గొన్నారు.