షాబాద్, మార్చి 2: పల్స్పోలియో కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 4,09,308 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీరికి 624 పోలియో బూత్ల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. 55 మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. 55 ట్రాన్సిట్ పాయింట్లు, సమాచార విస్తరణకు 55 వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 1600 మంది అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని 681 మంది వైద్యసిబ్బంది, 1,385 మంది ఆశ కార్యకర్తలతో కలిపి మొత్తం 3,666 మంది వైద్యసిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 11మంది అధికారులను నియమించారు.
బొంరాస్పేట, మార్చి 2 : పోలియో వ్యాధి నిర్మూలనకు ఏటా నిర్వహించే పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. వికారాబాద్ జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 89,903 మందిని అధికారులు గుర్తించారు. చుక్కల మందు వేసేందుకు 566 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కలిపి 1132 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లాను 57 రూట్లుగా విభజించారు. ఈ రూట్లలో 25 మొబైల్ టీంలు చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రతి ఒక్కరికీ చుక్కల మందు వేయించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆదివారం చుక్కల మందు వేయించని చిన్నారులకు మరుసటి రోజు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి మందు వేస్తారు. వ్యాక్సిన్ నిల్వ ఉండే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి చిన్నారికీ చుక్కల మందు వేయించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ పోలియో చుక్కల మందుపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులు కోరారు.