నవాబుపేట, జూలై 25: తెలంగాణ ఏర్పాటు తర్వాత మండలంలోని పులిమామిడి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. మండల కేంద్రానికి ఈ గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 12 వార్డులుండగా.. జనాభా 3,367 మంది ఉం డగా అందులో పురుషులు 1,729, స్త్రీలు 1,638 మంది ఉన్నారు. ఎమ్మెల్యే కాలె యాద య్య సహకారం.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజల దాహాన్ని తీర్చేందుకు గ్రామంలో నాలుగు మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. గ్రామంలో పీహెచ్సీతోపాటు నాలుగు అంగన్వాడీ కేంద్రాలు, పశువైద్య కేంద్రం, రెండు రేషన్ షాపులు, ఒక ప్రాథమిక, మరో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉన్నది. రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదిక భవనం కూడా ఉన్నది. గ్రామంలోని ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలు ఉండటంతో ఎండాకాలంలోనూ నీటి ఇబ్బందే కనిపించదు. ప్రతిరోజూ స్థానికులకు శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నది. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో పల్లె పరిశుభ్రంగా మారింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామానికి కొత్త కళను తీసుకొచ్చాయి.
ఎటుచూసినా పచ్చదనం సంతరించుకున్నది. పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న నిధులతో గ్రామంలో డంపింగ్యార్డు, కంపోస్టుషెడ్డు, ట్రాక్టర్, ట్యాంకర్, పల్లెప్రకృతివనం, హరితహారం నర్సరీ, వైకుంఠధామం వంటి అభివృద్ధి పనుల నిర్మాణాలు పూర్తైయ్యాయి. ప్రతిరోజూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు కృషి చేస్తున్నారు. వారు ఇంటింటికీ తిరిగి చెత్తాచెదారాన్ని సేకరించి ..తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు ట్రాక్టర్ ద్వారా తరలించి.. అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును పల్లెప్రకృతివనం, హరితహారం నర్సరీలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలు, పాఠశాలల వద్ద కూర్చునేందుకు వీలుగా గ్రామ సర్పంచ్ బెంచీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో చిటిగడ్డ రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కు ప్రతిరోజూ వందలాది మంది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. పలువురు వ్యాపారులు హైదరాబాద్ నుంచి వివిధ రకాల వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి.
పులిమామిడి పంచాయతీ కార్యాలయం
పులిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
వికారాబాద్ జిల్లాలోనే పులిమామిడి గ్రామా న్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారాన్ని మరువలేము. ఆయన గ్రామాభివృద్ధికి అధిక ంగా నిధులను కేటాయిస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తైంది. ఐదోవిడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలోని పాడుబడిన ఇండ్లను పూడ్చివేయడంతోపాటు బావులపైన ఇనుప జాలీలను ఏర్పాటు చేశాం. పల్లెను పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శు భ్రంగా ఉంచుతున్నారు. హరితహారంలో భాగంగా ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాం. గ్రామంలోని ఇంటింటికీ ఆరు మొక్కలను అందించి.. వాటిని నాటి సంరక్షించాలని సూచిస్తున్నాం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన మంత్రి సబితారెడ్డి మా గ్రామ వాతావరాణాన్ని చూసి మెచ్చుకున్నారు.
–విమలారంగారెడ్డి, గ్రామ సర్పంచ్ పులిమామిడి
పల్లెప్రగతితో సుందరంగా మారింది
గతంలో అధ్వానంగా ఉన్న మా గ్రామం పల్లెప్రగతి కార్యక్రమంతో సుందరంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నాం. పులిమామిడి అభివృద్ధికి గ్రామస్తులు, అధికారులు సహకరిస్తున్నారు. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. – తేజస్వినీరామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ..
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు గ్రామంలో విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నా. పులిమామిడి అభివృద్ధికి సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారం మరువలేనిది. పారిశుధ్య కార్మికులు గ్రామాన్ని ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచుతున్నా రు. గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై గ్రామసభలో సర్పంచ్ ఆధ్వర్యంలో చర్చించి స్థానికుల అనుమతి తీసుకుని వాటిని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. – బందయ్య, గ్రామ కార్యదర్శి