షాద్నగర్, జనవరి 30 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారనే విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొందుర్గు మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కరోనా వ్యాధి రాష్ట్రంలో తాండవించి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా, ప్రజాసంక్షేమాన్ని మాజీ సీఎం కేసీఆర్ విస్మరించలేదని, అప్పటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాల్లో గడపగడపకూ తెలపాలన్నారు. మిషన్భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందుతున్నాయన్నారు.
మిషన్కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసి భూగర్భజలాలను పెంచిన ఘనత, రైతుబంధు ద్వారా రైతులను ఆదుకున్న గొప్పతనం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. కల్యాణలక్ష్మి, దళితబంధు, బీసీ బంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలను బాగు చేశాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు లాభం చేకూరుస్తే మంచిదని సూచించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు. అదే విధంగా మండలానికి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్ పటేల్, శ్రీధర్రెడ్డి, మన్నె నారాయణ, రామచంద్రయ్య, నారాయణరెడ్డి, రెడ్డి నర్సింహులు, ఆకుల ఇస్తారమ్మ మానయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.