సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ):ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచినా నగరవాసులకు ఆకాశమార్గంలో అనువైన ప్రయాణంగా మెట్రో మారింది. మహానగరంలో మెట్రోకూతకు ఈ నెల 29తో ఐదేండ్లు పూర్తవుతున్నాయి.
నగరవాసుల కలల ప్రాజెక్టుగా మొదలైన మెట్రో ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్రమోదీ నాగోల్ -అమీర్పేట – మియాపూర్ మార్గాల్లో 30 కిలోమీటర్ల నిడివితో 2017 నవంబరు 29న ప్రారంభించారు. నాటి నుంచి మెట్రోకు ఆదరణ పెరుగుతుండడంతో నిత్యం ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. మొదటల్లో ప్రతి 15 నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులో ఉంటే ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులో ఉంది. కరోనా కారణంగా 5-6 నెలల పాటు మెట్రో పరుగులు నిలిచిపోయినా, మళ్లీ తర్వాత క్రమంగా పుంజుకున్నది.
4 లక్షల ట్రిప్పులు…
ఇప్పటి వరకు మొత్తం 30 కోట్ల మందికి పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. మూడు కారిడార్లలో 63 కి.మీ మేర పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు సుమారుగా 3 కోట్ల కిలోమీటర్ల దూరంలో 4 లక్షల ట్రిప్పులు ప్రయాణం చేశాయి. ఇదే ప్రయాణం పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా చేయాల్సి వస్తే 5.5 కోట్ల లీటర్ల ఇంధనం ఖర్చు అయ్యేదని అంచనా. మెట్రో అధికారులు, పర్యావరణవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ఐదేండ్లలో 150 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ వాతావరణంలో కలవకుండా మెట్రో అడ్డుకుంది. అంతేకాదు మెట్రో ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న సోలార్ సిస్టమ్ కారణంగా మరో 20 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ అరికట్టగలిగిందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండియన్గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి 23 మెట్రోస్టేషన్లకు ప్లాటినం సర్టిఫికెట్ లభించింది. ఇప్పటి వరకు మెట్రో రైలు ప్రాజెక్టులో 8.35 మెగా వాట్ల క్యాప్టివ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ సుమారు 15 శాతంగా ఉంటోంది. వీటితో మెట్రో రైలు దిగిన తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం విద్యుత్ వాహనాలనే ప్రోత్సహిస్తున్నారు.
మెట్రోకి దక్కిన అవార్డులు..
ఢిల్లీలో జరిగిన రైల్ అనాలసిస్ ఇండియా సదస్సులో గ్రీన్ అండ్ సస్టెయినబుల్ మెట్రో సిస్టమ్ అవార్డును హైదరాబాద్ మెట్రోకు లభించింది.
2018 సెప్టెంబర్లో అవుట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డు.
డిసెంబర్ 2018లో ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ అవార్డు
జనవరి 2019లో రైల్ ఎనాలసిస్ ఇండియా నుంచి అవుట్ స్టాండింగ్ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ ప్రాజెక్టు అవార్డు
మే 2019న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ నుంచి గోల్డ్ మెడల్ అవార్డు
ఆగస్టు 2019లో హైబ్రిడ్ ఐటీ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ అవార్డు
అక్టోబరు 2020లో ప్రైవేట్ సెక్టార్లో కన్స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డు
డిసెంబర్ 2020లో వెబ్ కమ్యూనికేషన్- ఆన్లైన్ కమ్యూనికేషన్లో ఏబీసీఐ అవార్డు
మార్చి 2021లో పీఆర్ఎస్ నుంచి సోషల్ మీడియా ఫర్ పీఆర్ అండ్ బ్రాండింగ్లో జాతీయ అవార్డు
సెప్టెంబర్ 2021లో పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డు
నవంబర్ 2021లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డు
నవంబర్ 2021లో కన్స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డు
మార్చి 2022లో లింగ సమానత్వంలో ఎఫ్టీసీసీఐ నుంచి అవార్డు
ఏప్రిల్ 2022లో రైల్ ఎనాలసిస్ ఇండియా నుంచి గ్రీన్ అండ్ సస్టెయినబుల్ మెట్రో సిస్టమ్ అవార్డు
సెప్టెంబర్ 2022లో ది ఎకనామిక్ టైమ్స్ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు-2022
వాట్సాప్తో టికెట్ బుకింగ్
ఎల్ అండ్ టీ మెట్రో సమస్యలపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరు స్థానంలో కొత్తగా వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో సేవలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అయినా, ఏవైనా ప్రశ్నలు అడగాలన్నా 07995999533 వాట్సాప్ నంబరులో సంప్రదించాలని అధికారులు తెలిపారు. వాట్సాప్ ద్వారానే మెట్రో టికెట్ను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. 8341146468 ఫోన్ నంబరుతో వాట్సాప్తో బుకింగ్ చేసుకోవచ్చు.