షాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాపాలన గ్రామసభలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో 4773 దరఖాస్తులనను అధికారులు స్వీకరించారు. చేవెళ్ల, షాబాద్ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి పరిశీలించారు. దరఖాస్తు ఫారానికి తప్పనిసరిగా రేషన్కార్డు, ఆధార్కార్డు జత చేయాలని అధికారులు చెప్పడంతో రేషన్కార్డు లేని వాళ్లు ఏం చేయాలో అర్థంకాక తిప్పలు పడుతున్నారు.
కొత్త రేషన్కార్డులు ముందుగా ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీడీవోలు అనురాధ, వెంకయ్య, హిమబిందు, సంధ్య, ఎంపీవోలు విఠలేశ్వర్జీ, హన్మంత్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, వ్యవసాయాధికారులు వెంకటేశం, రాగమ్మ, తులసి, చేవెళ్ల, సర్పంచ్లు బండారి శైలజ, తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, ఏఈలు నరేందర్, శ్రీదివ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
మొయినాబాద్ మండలంలోని సురంగల్, మొయినాబాద్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలు సరిపోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు ఒకేరోజు స్వీకరిస్తామని గ్రామాల్లో దండోరా వేశారని, మీరు చాలీచాలని దరఖాస్తు ఫారాలు ఇస్తే ఎలా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా అధికారులు సైతం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు గ్రామసభల్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. మొయినాబాద్ మండలంలో మాత్రం కిందిస్థాయి సిబ్బంది మీద వదిలిపెట్టి అధికారులు వెళ్లిపోయారు. గ్రామసభలకు వచ్చిన ప్రజలకు నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
తుర్కయంజాల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల హామీలను అమలు చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు దరఖాస్తు ఫారాల కోసం ఎగబడ్డారు. అధికారులు, మున్సిపల్ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. పోలీసులు రంగంలోకి దిగి ఫారాలను అందజేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో 24 వార్డలకు 2447 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, కమిషనర్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచాల : ప్రజలకు చేరువయ్యేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆరుట్ల, పీసీతండా గ్రామాల్లో ఆయన పాల్గొన్నారు. ఆరుట్లలో ఆరువేల మంది ఉండగా అందులో 2 వేల ఫారాలు రావడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, రాజు, ఎంపీటీసీలు రమేశ్, కావలి శ్రీనివాస్, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు
షాద్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆరు గ్యారెంటీల పథకాన్ని అర్హూలందరికీ వర్తింప చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామం, షాద్నగర్ మున్సిపాలిటీ యాదవ కాలనీల్లో ప్రజా పాలనను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎలాంటి పైరవీలకు అవకాశం ఇవ్వకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
దరఖాస్తుల స్వీకరణ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడే అధికారులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో ప్రజా పాలనను ప్రారంభించి ఆరు గ్యారెంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీవో వెంకట మాధవరావు, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆయా మండలాల ఎంపీడీవోలు, అధికారులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీస్, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
నందిగామ : అర్హులందరికీ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో దరఖాస్తుల స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కడ్తాల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రావిచేడ్, మక్తమాదారం, రేఖ్యాతండా, న్యామతాపూర్ గ్రామాల్లో, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ షేక్ ముంతాజ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రామాన్ని నిర్వహించారు. మక్తమాదారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అదే విధంగా తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్, తలకొండపల్లి, గట్టిప్పలపల్లి, వెల్జాల్, చంద్రధన, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన, ప్రజాపాలన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ రంగారెడ్డి, ఏంపీవో రఘు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్, సర్పంచ్లు సులోచన, హరిచంద్నాయక్, రవీందర్రెడ్డి, భారతమ్మ, లలిత, సంగీత, వెంకట్రామిరెడ్డి, కుమార్, ఎంపీటీసీలు మంజుల, శ్రీనివాస్రెడ్డి, గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : దరఖాస్తులు చేసుకునే వారు ఆందోళన చెందవద్దని, పది రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, సర్పంచ్ మంజుల, ఎంపీడీవో సంధ్య, మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ఆదిబట్ల : మున్సిపాలిటీ పరిధిలో 980 దరఖాస్తులను స్వీకరించినట్లు కమిషనర్ అమరేందర్రెడ్డి తెలిపారు. 5800 మందికి దరఖాస్తు ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. 5,898 కుటుంబాలకు 15 వార్డుల్లో 45 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో హల్చల్ చేశారు. పార్టీ కండువాలు వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా చేశారు. వారే నేరుగా ప్రజలు దరఖాస్తులను నింపి ఇచ్చారు.
ఆమనగల్లు : దరఖాస్తుల స్వీకరణ ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3, వార్డుల్లో , మండల పరిధిలోని శంకర్కొండ తండాలో సిబ్బంది దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపాలిటీలోని 3వ వార్డు నుచ్చుగుట్టతండాలో కల్వకుర్తి నియోజకవర్గ స్పెషల్ అఫీసర్ జటావత్ రామారావు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తు ఫారాలు ఎలా పూరించాలో ప్రజలకు సూచనలు చేయకపోవడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం లో ఎంపీపీ నేనావత్ అనిత, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, తహసీల్దార్ లలిత, ఎంపీడీవో ఫారూఖ్ హుస్సేన్, కమిషనర్ శ్యామ్సుందర్, వైస్ చైర్మన్ దుర్గయ్య, అధికారులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : అభయహస్తం గ్యారెంటీల కోసం అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్రెడ్డి కోరారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. పెద్దఅంబర్పేట, కుంట్లూరు తదితరచోట్ల స్థానిక కౌన్సిలర్లతో కలిసి రవీందర్రెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 24 వార్డుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు రోహిణిరెడ్డి, విద్యావతిరెడ్డి, దేవిడి గీతారెడ్డి, పసుల రాజేందర్, దండెం కృష్ణారెడ్డి, మద్ది శ్రీధర్రెడ్డి, రమావత్ పరశురాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో ఎంపీడీవో బాల్రెడ్డి, నర్సప్పగూడలో తహసీల్దార్ అయ్యప్ప, మేకగూడలో ఎంపీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో కలిసి సభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మధ్యవర్తులను నమ్మకూడదని, నేరుగా అధికారులకు దరఖాస్తులు అందించాలన్నారు.
యాచారం : మొదటి రోజు ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా కోసం ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ధర్మన్నగూడ, తులేఖుర్ధు గ్రామాల్లో తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో ఎంపీడీవో విజయలక్ష్మి ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలు దరఖాస్తు ఫారాలను తీసుకోవడానికి పోటీ పడ్డారు. తాగునీటి వసతి, వైద్యశిబిరం తదితర వసతులను కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ జంగయ్య, ఎంపీడీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం గురువారం ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అర్హులందరూ పథకాల లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఫారం లేకపోతే ఆరు గ్యారెంటీలు రావేమో అనే భయంతో ప్రజలు దరఖాస్తు ఫారాల కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. జనాలను కార్యాలయాల సిబ్బంది అదుపు చేయలేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఫారాలను అందజేశారు.