ఐదెకరాలు… రూ.10 కోట్లు… రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ రేటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మహేశ్వరం సీటుకు నోటు వ్యవహారం హస్తినకు కూడా చేరడంతో అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఆరోపణలు వచ్చిన నేతకు టికెట్ ఇస్తే పార్టీ పరువు గంగలో కలుస్తుందని జంకుతున్న అధిష్ఠానం… మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరు తాజాగా తెరపైకి తీసుకువచ్చారు. మేడ్చల్ జిల్లా వదిలి… వికారాబాద్ జిల్లాలో విఫల యత్నం చేసి… ఎక్కడా అవకాశం దొరక్క వేచి చూస్తున్న కేఎల్ఆర్ను మహేశ్వరంలో పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఐదెకరాలు.. రూ.10 కోట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ రేటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మహేశ్వరం టికెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇంత భారీ మొత్తం ఇచ్చారా? అని సీనియర్ నేత వీహెచ్ ఢిల్లీ వేదికగా వాకబు చేసినట్లు తెలిసిందే. కాంగ్రెస్ నేత గతంలోనే ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ఇలా.. సీటుకు నోటు వ్యవహారం హస్తినకు కూడా చేరడంతో అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది.
ఆరోపణలు వచ్చిన నేతకు టికెట్ ఇస్తే పార్టీ పరువు గంగలో కలుస్తుందని జంకుతున్న అధిష్ఠానం.. నియోజకవర్గంలో సరైన నేత లేకపోవడంతో మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరు తాజాగా తెరపైకి తీసుకువచ్చారు. మేడ్చల్ జిల్లా వదిలి.. వికారాబాద్ జిల్లాలో విఫల యత్నం చేసి.. ఎక్కడా అవకాశం దొరక్క వేచి చూస్తున్న కేఎల్ఆర్ను మహేశ్వరంలో పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్కు అభ్యర్థి దొరకక అయోమయంలో పడిపోతే.. జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో స్పందన లేదని గుర్తించి, ఆ సీటుపై ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్లో టికెట్ల రేటు ఎకరాలు… కోట్లల్లో ఉందనే విషయం మహేశ్వరం వేదికగా బయటి ప్రపంచానికి తెలిసింది. ఐదెకరాలతో పాటు రూ.10 కోట్ల మొత్తాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇచ్చి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుంటున్నానని ఒక నాయకుడు చెప్పుకుంటున్నట్టు ఆ పార్టీకి చెందిన నాయకుడే వెల్లడించారు. ఏకంగా రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు ఆశావహులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదరు నేత కుండబద్దలు కొట్టారు. ఇక్కడ తీగ కదలడంతో ఏకంగా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే రీతిన టికెట్ల కొనుగోలు వ్యవహారం జరిగిందనే డొంక బయటపడింది. అయితే, ఈ అంశంపై ఆది నుంచి కాంగ్రెస్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.
ఇదే విషయం ఢిల్లీ స్థాయిలోని అధిష్ఠానానికి కూడా తెలియడంతో మొదటి జాబితాలో మహేశ్వరం నియోజకవర్గాన్ని ప్రకటించలేదని తెలిసింది. ఆరోపణలు వస్తున్న వారికి టికెట్ ఇస్తే పార్టీ పరువు పోతుందని అధిష్ఠానం వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో అభ్యర్థి కోసం గత కొన్ని రోజులుగా అన్వేషణ మొదలుపెట్టినా.. ఆ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. అధికార బీఆర్ఎస్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నేండ్లుగా చేసిన భారీ అభివృద్ధితో నియోజకవర్గంలో గులాబీ పార్టీకి తిరుగులేని పరిస్థితి ఉన్నట్లు ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ ఉంది. ఈ క్రమంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో పెద్దగా ప్రభావం లేనట్లు తెలుస్తున్నది. దీంతో కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచైనా సరైన అభ్యర్థిని నిలిపేందుకు ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది.
మహేశ్వరం టికెట్ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం దరఖాస్తు చేసుకున్న ఇతర నేతల పేర్లను కూడా పరిశీలించినట్లు తెలిసింది. కానీ, స్పష్టత రాకపోవడంతో తాజాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం కేఎల్ఆర్తో భేటీ అయినట్లు తెలిసింది. వాస్తవానికి చేవెళ్లకు చెందిన కేఎల్ఆర్ 2009లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి… టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం, 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అదే మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆపై రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లుగా కూడా కనిపించలేదు. ఇలా మేడ్చల్ నుంచి ఒక దఫా మినహా మిగిలిన రెండుసార్లు ఓటమిని చవి చూసిన కేఎల్ఆర్… ఈసారి అటువైపు కన్నెత్తి చూడలేదు.
ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ, తాజాగా ఎన్నికలు రావడంతో తిరిగి కాంగ్రెస్లో ఆయన క్రియాశీలకంగా మారినప్పటికీ… పలానా నియోజకవర్గమంటూ లేకపోవడంతో ఎన్నికల ‘చౌరస్తా’లో నిలిచారు. మేడ్చల్ను వదిలి ఏకంగా వికారాబాద్ జిల్లా వైపు చూశారు.
తాండూరు నియోజకవర్గం నుంచి టికెట్ కావాలంటూ గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడి నుంచి టికెట్ వచ్చే సంకేతాలేవీ కనిపించకపోవడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం వైపు తొంగి చూశారు. ఈ మేరకు స్థానిక నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. అయినప్పటికీ అక్కడ కూడా సానుకూల పరిస్థితులు లేకపోవడంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
తాజాగా, మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దింపాలో తెలియక అయోమయంలో ఉన్న పార్టీ అధిష్ఠానం కేఎల్ఆర్ పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మహేశ్వరం నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు రంగంలోకి దిగి ఒత్తిడి చేస్తున్నారు. దీంతో మేడ్చల్… తాండూరు… రాజేంద్రనగర్… తాజాగా మహేశ్వరం! కేఎల్ఆర్ పరిస్థితి ‘తెగిన గాలిపటం’లా తయారైందంటూ ఆ పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు.