షాద్నగర్రూరల్ : కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల ఉజ్వలభవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ పాఠశాలల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి స్వయంగా శానిటైజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనునిత్యం తరగతి గదులను శానిటైజేషన్ చేయాలని, అదే విధంగా టాయిలెట్స్, నీటి ట్యాంక్లను శుభ్రం చేయాలని గ్రామ సర్పంచులకు, సిబ్బంది సూచించారు. విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పరీక్షలు చేయించాలన్నారు. ఒకవేళా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో శరత్బాబు, సర్పంచ్ సాయిప్రసాద్, ఎంపీటీసీ శ్రీశైలం పాల్గొన్నారు.