ఇబ్రహీంపట్నం, మార్చి 12 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అవిశ్వాసాల పేరుతో ఆయా పార్టీల నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. మూడు మాసాల్లో సెగ్మెంట్లో ఆరు అవిశ్వాస తీర్మానాలకు తెరలేపారు. క్యాంపుల పేరుతో కౌన్సిలర్లు, డైరెక్టర్లు నెలల తరబడి అజ్ఞాతంలోకి వెళ్తుండడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై.. ఉప్పరిగూడ సహకార సంఘం అధ్యక్షుడిపై అవిశ్వాసాలు పూర్తయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్స న్ బలపరీక్షలో విజయం సాధించగా.. ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్ విశ్వాస పరీక్షలో నెగ్గినా కేసు కోర్టులో ఉండడంతో ఫలితాన్ని నిలిపివేశారు. చైర్ పర్సన్పై అవిశ్వాసం పెట్టడంతో ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు.. అదేవిధంగా సహకార సంఘం చైర్మన్పై పెట్టిన అవిశ్వాసంతో 11 మంది డైరెక్టర్లు నెలరోజులపాటు క్యాంపులకెళ్లారు. అలాగే, ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్పైనా సభ్యులు అవిశ్వాలు పెట్టడంతో ఇరుపార్టీలకు చెందిన వారు.. తుర్కయాంజాల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ల పైనా అవిశ్వాసాలు పెట్టగా కౌన్సిలర్లు, డైరెక్టర్లు కూడా క్యాంపుల పేరుతో నెల రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. మూడు నెలల్లో సెగ్మెంట్లో ఆరు అవిశ్వాస తీర్మానాలను సభ్యులు పెట్టారు. తాజాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్పర్సన్పైనా 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి… సభ్యులు క్యాంపులకు వెళ్లిపోయారు.
ఇలా వచ్చి, అలా వెళ్లిన.. ఇబ్రహీంపట్నం కౌన్సిలర్లు..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు ఇలా వచ్చి ..అలా మళ్లీ క్యాంపులకెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టడంతో 15 మంది కౌన్సిలర్లు నెలరోజులపాటు క్యాంపులకెళ్లారు. బలపరీక్ష కంటే ముందే ఇద్దరు కౌన్సిలర్లు చైర్పర్స న్ వర్గం వైపు జంప్ కావడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో తమ ఇండ్లకు చేరుకున్న కౌన్సిలర్లు పట్టుమని పదిరోజులు కూడా ఉండకుండానే వైస్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టి మళ్లీ క్యాంపులకెళ్లారు. అవిశ్వాసాల పుణ్యామా అంటూ ప్రజాప్రతినిధులంతా క్యాంపుల పేరుతో గోవా, ఇతర పర్యాటక ప్రాంతాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో మున్సిపల్లో అభివృద్ధి పనులు జరుగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అవిశ్వాసాలతో నాయకుల జేబులకు చిల్లు..
వరుసగా అవిశ్వాసాలు వస్తున్న నేపథ్యంలో క్యాంపులు నిర్వహిస్తుండడంతో ఆశావహుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మున్సిపాలిటీలు, సహకార సంఘాలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్నా అవిశ్వాసాల విషయంలో మా త్రం ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఎలాగైనా తమ పదవులను కాపాడుకునేందు కు ప్రస్తుతం ఉన్న నాయకులు ప్రయత్నిస్తుండగా…వారి నుంచి పదవులు చేజేక్కించుకునేందుకు ఆశావహులు యత్నిస్తున్నారు. దీంతో వారు ఖర్చులకు వెనకాడడంలేదు. ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇవ్వడంతోపాటు నెలల తరబడి క్యాంపులు నిర్వహించాల్సి రావడంతో నాయకులపై ఆర్థికంగా భారం పడుతున్నది.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..
వరుసగా అవిశ్వాసాలు వస్తున్న నేపథ్యంలో ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అవిశ్వాసాలు అనగానే పార్టీలు పక్కనబెట్టి ప్రజాప్రతినిధులంతా ఏకమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి అవిశ్వాసాల వరకు ప్రజాప్రతినిధులంతా పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతోపాటు ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ వంటి పరిణామాల నేపథ్యంలో కౌన్సిలర్లు, డైరెక్టర్లు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ప్రజాప్రతినిధులు తిరిగి తమ సొంత పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. అలాగే, బీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులూ కాంగ్రెస్లో చేరుతున్నారు.