ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6 : కరోనా తరువాత కల్యాణగడియలు, శుభకార్యాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు మరోమారు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వల్ల రెండేండ్లుగా శుభకార్యాలు, కల్యాణాలకు దూరంగా ఉంటున్న ప్రజలు ఇప్పుడిప్పుడే సాఫీగా శుభకార్యాలు చేసుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్ నెలలో మంచి ముహూర్తాలు ఉండడం వల్ల పెండ్లిళ్లు, గృహప్రవేశాలు ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హంగు ఆర్భాటాలతో కార్యక్రమాలు చేస్తుండడం బంధుమిత్రులు అధిక సంఖ్యలోనే హాజరవుతున్నారు. పరిమిత సంఖ్యలో శుభకార్యాలు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు మాస్కులు ధరించకపోగా, భౌతికదూరాన్ని కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కరోనా కేసులు పెరుగడంతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రజలు భయం గుప్పిట్లోకి వెళ్తున్నారు. ఒమిక్రాన్ భారత్లో ప్రవేశించి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది శుభకార్యాలు, వివాహాలకు కల్యాణ మండపాలనూ బుక్ చేసుకున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచిస్తుండడంతో ప్రజల్లో మళ్లీ అయోమయం నెలకొన్నది. కరోనా భయం వీడడంతో ఆర్థిక వ్యవస్థ కూడా గాడిన పడింది. కొత్త వేరియంట్తో మరోమారు వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో జరిగే శుభకార్యాలన్నీ సజావుగా సాగుతాయో లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కరోనా కేసులు పెరిగాయి. జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగడమే కాకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
పెండ్లిళ్లకు పరిమిత సంఖ్యలో బంధువులు హాజరయ్యేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శుభకార్యాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు కల్యాణ మండపాల్లో కరోనా నిబంధనల ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేయాలి. పెండ్లి ప్రదేశంలో శానిటైజర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. శుభకార్యాల నిర్వహణ సమయంలో సలహాలు తీసుకోవాలి. భోజన సదుపాయం వద్ద క్యాటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. తక్కువమందితో అతితక్కువ సమయంలో శుభకార్యాలు ముగించుకునేలా చూసుకుంటే మంచిదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
కళకళలాడుతున్న కల్యాణ మండపాలు..
కల్యాణ మండపాలు, ఫంక్షన్హాల్లు కళకళలాడుతున్నాయి. శుభకార్యాలపై ఆధారపడ్డ ఆశాజీవులకు ఊరట కలిగింది. కల్యాణ మండపాల్లో బాసింగాలతో ఉన్న వధూవరులు మురిసిపోతున్నారు. డిసెంబర్ నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో ఇటీవల కల్యాణ వేదికల్లో పెండ్లి బాజాలు మోగుతున్నాయి. టెంట్హౌస్ల ఓనర్లు, వంటమాస్టర్లు, ఫొటోగ్రాఫర్లు, ఫూల వ్యాపారులు, ఆభరణాల వ్యాపారులు, అర్చకులు, ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారులు బిజీ అయ్యారు. జనవరి 15 తరువాత శుభ ముహూర్తాలు లేకపోవడంతో ఈ లోపే వివాహాది శుభకార్యాలను పూర్తి చేయాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఇంతలోనే ఒమిక్రాన్ ముప్పు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నది.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు శుభకార్యాలు, పెండ్లిళ్లకు దూరంగా ఉండాలి. ఆర్భాటాలకు వెళ్లి ఎక్కువ మందిని ఆహ్వానించకూడదు. ఏదైనా వేడుకకు అతితక్కువ మందితో నిర్వహించుకోవడం మంచిది. బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించడం వల్ల వైరస్ను అదుపుచేసేందుకు అవకాశముంటుంది. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి.