ఆర్కేపురం, జూన్ 16 : ప్రజలకు పారదర్శకమైన సత్వర సేవలందించాలనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో వార్డు కార్యాలయాలన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ కృష్ణానగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయం, సరూర్నగర్ డివిజన్లోని ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చెవేళ్ల ఎంపీ రంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అదే విధంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు.
సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన వార్డుస్థాయి పాలనతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందుతాయని చెప్పారు. బస్తీల్లో ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు స్థాయి పాలన సాగుతుందన్నారు. వార్డుస్థాయిలో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. వాటి పరిష్కారానికి తక్షణమే స్పందించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో నియోజకవర్గంలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 22వేల కంపెనీలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం 22లక్షల మందికి ఉపాధి దక్కిందన్నారు. శాంతిభద్రతలు, 24 గంటల కరెంట్ ఉండడం ద్వారా ఇవి సాధ్యమయ్యాయని చెప్పారు.
కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్లో ప్రత్యేకంగా రెండు రిజర్వాయర్లు కట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించే ఆ స్థలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రూ.1200కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్సిటల్ను కడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇంటి ముందటే వైద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు. ఇంకా కొన్ని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, సరూర్నగర్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితారెడ్డిదయాకర్రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషన్ పంకజ, సరూర్నగర్ తహసీల్దార్ జయశ్రీ, సరూర్నగర్ సర్కిల్ డీసీ హరికృష్ణయ్య, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పి.నగేష్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు..
కొడంగల్ : పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి, పారిశుధ్యం, హరితహారం వంటి కార్యక్రమాల నిర్వాహణలపై కొడంగల్ మున్సిపాలిటీ ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా కొడంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధితో పాటు హరితహారం, గ్రీన్స్పేస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో మున్సిపాలిటీకి అవార్డు వచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి, ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.