బొంరాస్పేట, ఫిబ్రవరి 16 : పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర్లాపడుకుని పాకుకుంటూ వెళ్లాలి. ఇది మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో కొలువైన పరమేశ్వరుడి విశిష్టత. కొన్నేండ్ల క్రితం రెండు పెద్ద రాళ్ల మధ్యలో లింగమూర్తి ఉం డేది. భూమికి రాతిగుండుకు మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో పాకుకుంటూ వెళ్లేందుకు కూడా అవకాశం ఉండేదికాదు. కాలక్రమంలో లింగమూర్తిపై ఉన్న రాతిగుండు కరిగి కొద్దిగా సంధు ఏర్పడింది. ఇది పరమేశ్వరుడి మహిమేనని భక్తుల ప్రగాఢ నమ్మకం.
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో 163వ నంబర్ (హైదరాబాద్-బీజాపూర్) జాతీయ రహదారికి పక్కన కిలోమీటర్ దూరంలో ఎత్తైన గుట్టపై పరమేశ్వరాలయం ఉన్నది. పూర్వకాలంలో ఇక్క డ పెద్ద రాతిగుండు కింద స్వయంభువుగా లింగమూర్తి రూపంలో పరమేశ్వరుడు వెలిశాడ ని స్థానికులు చెబుతుంటారు. అప్పట్లో భక్తులు లింగమూర్తికి పూజలు చేయాలంటే బోర్లాపడుకుని.. పాకుకుంటూ వెళ్లాల్సి వచ్చేదని.. ఏటేటే రాతిగుండు కొద్దికొద్దిగా కరుగుతుండటంతో భక్తులు వెళ్లేం దుకు అవకాశం ఏర్పడిందని.. ప్రస్తుతం కొద్దిగా వంగి వెళ్లి పూజలు చేస్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు.
1995లో ఆలయ నిర్మాణం
దాతల సహకారంతో స్థానికులు 1995లో పరమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉన్నది. తర్వాత కొంతమంది భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సాయిబాబా, భ్రమరాంబ అమ్మవారి ఆలయాలను నిర్మించడంతోపాటు నవగ్రహాలు, ధ్వజ స్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు. బోరువేసి భక్తులకు మంచినీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు మట్టి రోడ్డును నిర్మించారు. ప్రతి ఏటా కార్తిక, మాఘ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రిని భక్తులు ఘనంగా జరుపుకొంటారు. ఏటా ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమినాడు పరమేశ్వరుడి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఈ ఆలయంలో 60 నుంచి 70 వరకు వివాహాలు జరుగుతాయి.
ఆహ్లాదకర వాతావరణం
పరమేశ్వరాలయం ఎత్తైన గుట్టపైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కుంటలు కనువిందు చేస్తాయి. పూర్వకాలంలో ఈ గుట్టపై మునులు తపస్సు చేసినట్లుగా స్థానికులు చెబుతుంటారు.
ఆలయానికి ఇలా వెళ్లాలి
ఈ ఆలయం నాగిరెడ్డిపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి పక్కన ఉన్నది. హైదరాబాద్, పరిగి నుంచి యాద్గిర్, సేడం, గుల్బర్గా, కొడంగల్, కోస్గి, నారాయణపేట వెళ్లే బస్సుల్లో ఎక్కితే ఆలయానికి సమీపంలోనే దిగి చేరుకోవచ్చు.
స్వామివారి మహిమే..
నేను గత 30 ఏండ్లుగా ఈ ఆలయాన్ని చూస్తున్నా. అప్పట్లో రాతిగుండు కింద ఉన్న లింగమూర్తిని దర్శించుకుని.. పూజలు చేసేందుకు వీలు ఉండేది కాదు. రానురాను రాతి గుండు కరుగుతున్నది. ఇప్పుడు సులభంగా వంగి వెళ్లి అభిషేకం, పూజలు చేస్తు న్నాం. స్వామివారి మహిమతోనే రాతి గుండు కరుగుతున్నది.
-శాంతుకుమార్, పూజారి