ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 18 : గత పదేండ్లలో అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తవుతాయని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో పేదలంతా సుభిక్షంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చటానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని గుర్తు చేశారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయటంతో పాటు ఎన్నో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారని, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు చేయటం వల్ల ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కష్టాలు తప్పవని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ..కార్యకర్తలు పార్టీకి పునాదిలాంటివారని, పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావడానికి కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కష్టపడాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల మహేశ్గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్, కౌన్సిలర్లు యాచారం సుజాత, నీలం శ్వేత, కసరమోని పద్మ, అల్వాల జ్యోతి, నల్లబోలు మమత, మంద సుధాకర్, శంకరయ్య, నరాల విశాల, కొండ్రు శ్రీలత, నీళ్ల బానుబాబు, బర్తాకి జగన్, ముత్యాల ప్రసన్నలక్ష్మి, జెర్కోని బాలరాజు, పార్టీ నాయకులు యాచారం రవీందర్, జెర్కోని రాజు, ఆబేద్, కొండ్రు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో బైకు ర్యాలీ
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలర్లు మంద సుధాకర్, బర్తాకి జగన్ పార్టీ నాయకులు యాచారం రవీందర్, కొండ్రు ప్రవీణ్ల ఆధ్వర్యంలో వెంకటరమణనగర్ కాలనీ నుంచి పాతబస్టాండ్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.