షాద్నగర్, డిసెంబర్7 : ప్రభుత్వం సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే కేటాయిస్తారని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని గణేశ్ గార్డెన్లో నిర్వహించిన లబ్ధిదారుల ఎంపిక అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ వేల కోట్లను ఖర్చుచేసి అన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, అందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. దరఖాస్తు చేసుకునే విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత అధికారులతో తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఆర్డీవో రాజేశ్వరి, తహసీల్దార్ గోపాల్, పాల్గొన్నారు.
రూ. 1.40 కోట్ల నిధులతో మురుగు కాలువ నిర్మాణం
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో రూ. 1.40 కోట్ల నిధులను వెచ్చించి అంతర్గత మురుగు కాలువలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. మురుగు కాలువ పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. త్వరలోనే అన్ని కాలనీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మురుగు కాలువలు, సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయని, అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లను 100 శాతం నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కౌన్సిలర్లు జీటీ శ్రీనివాస్, నాయకులు యుగేందర్, జూపల్లి శంకర్, చెట్ల నర్సింహ, గుడ్డుయాదవ్, రాఘవేందర్, రాజశేఖర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి కృషి
నందిగామ : ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని అయ్యప్ప కాలనీలో గ్రామ పంచాయతీ నిధులతో సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్గౌడ్, ఎంపీటీసీ కుమారస్వామిగౌడ్, నాయకులు పెంటయ్యగౌడ్, బాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.