వికారాబాద్, జనవరి 9 : జిల్లా అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపడుతున్న పనుల పురోగతి, ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అవసరాలు తీర్చే దిశగా పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ ఆర్అండ్బీ శాఖల ద్వారా చేపడుతున్న పనుల నివేదికను సమర్పించాలని, పాలన పరమైన అనుమతులు వచ్చిన పనులు వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరంగా చేయవలిసిన పనులు ఏవైనా ఉంటే వాటి ప్రాధాన్యతను బట్టి జాబితాను రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక అవసరాల నిమిత్తం వినియోగించే దిశగా భూ సేకరణ చేపట్టాలని, ఇంటర్నేషనల్ స్కూల్స్ మంజూరు అవుతున్న నేపథ్యంలో మండల కేంద్రాల్లో 10 ఎకరాల భూసేకరణకు చర్య తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పారిశ్రామిక రంగాలను నెలకొల్పేందుకు 10 ఎకరాలకు తక్కువ కాకుండా భూముల వివరాలను వారం రోజుల్లోగా రికార్డులతో సహా ప్రతిపాదన రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారులకు, రైల్వే పనులకు సంబంధించి స్థల సేకరణలో జాప్యం వహించకుండా వారం రోజుల్లోగా భూ సేకరణ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలోని ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల వివరాలు ఉన్నతాధికారులకు సూచించాలని ఆయన తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారుల సలహాలు, సహకారం తీసుకొని అనువైన పంటలు వేసేందుకు అంచనాల రూపొందించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, కాలేజీలను వారం రోజుల్లోగా సంబంధిత నియోజకవర్గాల పరిధిలోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంజూరైన గురుకుల పాఠశాలకు, కాలేజీలకు వారం రోజుల్లోగా భూముల కేటాయింపు జరగాలని కలెక్టర్ తెలిపారు.
మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల జాబితాలను రూపొందించాలని పేర్కొన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. స్టడీ మెటీరియల్, స్నాక్స్ ఇతరత్రా సదుపాయాలను విద్యార్థులకు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ దవాఖానరల్లో ఆశ వర్కర్లు, సిబ్బంది ఖాళీల జాబితాను రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. దవాఖానల భవనాలు, కావాల్సిన వైద్య పరికరాలపై నివేదిక రూపొందించాలన్నారు. ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ జనరేటర్, సదుపాయం కోసం ప్రతిపాదన ఇవ్వాలని కలెక్టర్ వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు విజయకుమారి, శ్రీనివాసరావు, వివిధ శాఖల ఇంజినీర్ విభాగాల అధికారులు, జిల్లా, మండలాల అధికారులు పాల్గొన్నారు.