రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి భరతం పడుతున్నారు. అయినప్పటికీ అధికారుల అవినీతి మాత్రం తగ్గడంలేదు. అన్ని శాఖల్లోనూ ఇదే తంతు నెలకొన్నది. ఇప్పటికే పలువురు అధికారులు ఏసీబీకి నేరుగా పట్టుబడ్డారు. తాజాగా మంగళవారం తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ఓ పంచాయతీ కార్యదర్శి ఇంటి స్థలం ఆన్లైన్ చేయడం కోసం బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ముఖ్యంగా భూ సమస్యలకు సంబంధించి పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి తమకు అనుకూలంగా రిపోర్టు రాయించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులకు లంచాలిస్తేనే అనుకూలంగా రిపోర్టులు ఇస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో బాధితులు పెద్దఎత్తున లంచాలు ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. విద్యుత్ శాఖలోనూ కొత్త కనెక్షన్లు, అధిక బిల్లులను తగ్గించుకునేక్రమంతోపాటు అదనపు ఓల్టేజీ సమస్య పరిష్కరించుకునేందుకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటికి లంచాలు ముట్టజెపితేనే పనులు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అవినీతి జరుగుతున్నదని ఆరోపణలొస్తున్నాయి. పార్కు స్థలాలు, కోర్టు వివాదంలో ఉన్న స్థలాలు వంటి వాటికి రిజిస్ట్రేషన్ల విషయంలో లంచాలు ముట్టజెపితేనే పనులు జరుగుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.
జిల్లా పరిధిలో తలకొండపల్లి, ఆమనగల్లు తహసీల్దార్లతోపాటు ఇబ్రహీంపట్నం, తలకొండపల్లితోపాటు వివిధ మండలాల్లో ఆర్ఐలు, ఇతర కిందిస్థాయి సిబ్బంది ఏసీబీ అధికారులకు., మున్సిపల్ శాఖలో కీలకమైన టీపీఓలు కూడా ఇటీవల పలువురు పట్టుబడ్డారు. ఆదిబట్ల, శేరిలింగంపల్లి వంటి మున్సిపల్ కార్యాలయాల్లో ఇద్దరు టీపీఓలు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. హయత్నగర్, గచ్చిబౌలి, పెద్దఅంబర్పేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా లంచాలు తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్లు పట్టుబడ్డారు. షాద్నగర్, తలకొండపల్లి శంషాబాద్ వంటి మండలాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి చిక్కారు. జిల్లాలో ఇప్పటివరకు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారుల సంఖ్య 20 దాటింది. చేయి తడపనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. లంచాలివ్వకపోతే ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ఓ ఇంటి ఖాళీ స్థలాన్ని ఆన్లైన్ చేయడం కోసం రూ.20వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి శరత్కుమార్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈమేరకు బాధితులకు సంబంధించిన ఓ పాత ఇంటి స్థలాన్ని విక్రయించడానికి నిర్ణయించుకున్నారు. ఇంటి స్థలం మార్కెట్ విలువతోపాటు ఆన్లైన్ చేయడం కోసం పంచాయతీ కార్యదర్శి శరత్కుమార్ను ఆశ్రయించారు. దీంతో మార్కెట్ విలువతోపాటు ఆన్లైన్ చేస్తానని.. అందుకు రూ.30వేలు లంచమివ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశారు. అనుకున్న ప్రకారం కార్యదర్శి ఇంటి ఆన్లైన్తోపాటు మార్కెట్ వ్యాల్యూ కూడా చేయడంతో బాధితులు ఇంటి స్థలంలో కొంత భాగాన్ని అమ్ముకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి తరచుగా ఫోన్లు చేసి తనకు డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. అందులో భాగంగానే మంగళవారం బాధితులు వెల్జాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి రూ.20వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.