వికారాబాద్, మే 15(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహి ళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరా ణా షాపులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలను మంజూరు చేయాలని అధికారు లు నిర్ణయించారు. ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ రుణాలకు రూ.564 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.13 కోట్ల రుణాలను అదనంగా పెంచా రు. కాగా, జిల్లాలో 657 గ్రామ సంఘాలుండగా, 15,023 స్వయం సహాయక సంఘాలు, 1,80,000 మంది సభ్యులు ఉన్నారు. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి పొందే సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మం జూరు చేస్తూ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నా రు. సంఘాల పనితీరును బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
గతేడాది రూ.518 కోట్ల రుణాలు
జిల్లాలో ప్రతి ఏటా ఎస్హెచ్జీలకు లక్ష్యానికి తగినట్లుగా అధికారులు రుణాలను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 5,475 స్వయం సహాయక సంఘాలకు రూ.518 కోట్ల రుణాలను మంజూరు చేశారు. దోమ మండలంలో రూ.38.69 కోట్లు, మర్పల్లిలో రూ.34.99, కులకచర్లలో రూ.36.67, నవాబుపేటలో రూ.31.14, తాండూరులో రూ.36.95, మోమిన్పేటలో రూ.30.35, యాలాలలో రూ.30.07, బషీరాబాద్లో రూ.23.36, పరిగిలో రూ.23.87, బంట్వారంలో రూ. 21.60, చౌడాపూర్లో రూ.20.15, ధారూరులో రూ.26.33, పెద్దేముల్లో రూ. 26, పూడూరులో రూ.24.05, వికారాబాద్లో 13.29, దౌల్తాబాద్లో రూ.23.53, కొడంగల్లో రూ.24.40, కోట్పల్లిలో రూ.23.73, బొంరాస్పేట మండలంలో రూ. 28.76 కోట్ల రుణాలను మంజూరు చేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.
ఎన్పీఏలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్హెచ్జీ సభ్యుల్లో అవగాహన కల్పిస్తున్నా జిల్లాలోని కొన్ని సంఘాల్లో ఇంకా మార్పు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.19 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు డీఆర్డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది.