షాబాద్, డిసెంబర్ 17: నాణ్యమైన, ఆరోగ్యకరమైన నారును పెంచాలంటే చాలా కష్టం. నారు పెంచే సమయంలో ఎండలు ఎక్కువగా ఉన్న, చలి అధికంగా ఉన్న మొలకెత్తిన నారు కుప్పకుప్పలుగా చనిపోతుంది. దీంతో అనుకున్న స్థాయిలో పంట ను నాటుకోలేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు అలాంటి నష్టాలు లేకుండా ఆరోగ్యకరమైన నారును అందించి అటు ఆర్థికంగా నష్టపోకుండా, ఇటు కాలం కలిసొచ్చేలా నర్సరీ కేం ద్రా లు నారును పెంచి రైతన్నలకు సరఫరా చేస్తున్నాయి.
తక్కువ ఖర్చుతో రైతులకు సకాలంలో ఆరోగ్యకరమైన నారు(మొక్కలు)ను తయారు చేసి ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున నర్సరీ కేంద్రాలు ఏర్పడ్డాయి. పలు గ్రామాల్లో కూరగాయాలను సాగు చేసే రైతులు తాము సాగు చేసే నారును కూడా నర్సరీల నుంచే తీసుకెళ్తున్నారు. రైతులు విత్తనాలు తెచ్చి ఇచ్చిన.. లేక రైతు చెప్పిన రకాన్ని నర్సరీల నిర్వాహకులు తెచ్చి పెంచి నారు ను ఇస్తున్నారు. విత్తనాలను రైతులు కొనుగోలు చేసి ఇస్తే తక్కువ ధరకే నారును విక్రయిస్తున్నారు. ఏడాది పొడవునా వంకాయ, టమాట, మిర్చి, కాలీప్లవర్, కూరగాయలు, బంతి, చామంతి, తదితర పూల నారును నర్సరీల్లో పెంచుతున్నారు.
నర్సరీల్లో విత్తనాన్ని శుద్ధి చేసి వైరస్లు సోకకుండా ప్రత్యేకంగా తయారు చేసిన షెడ్లల్లో నారును పెం చుతారు. ఎప్పటికప్పుడూ నారును పరిశీలిస్తూ కావాల్సిన పోషకాలు అందివ్వడంతో తక్కువ సమయంలోనే నారు ఏత దశకు వస్తుంది. పంట పొ లంలో మొక్క నాటిన అనంతరం కూడా ఆరోగ్యం గా పెరిగి తొందరగా పంట చేతికి రావడంతో పాటు రైతు అధిక దిగుబడులు సాధించొచ్చు.
ఒక్కొక్క విత్తనాన్ని ట్రేలల్లో జాగ్రత్తగా నాటడంతో ప్రతి విత్తనం మొలకెత్తి ఆరోగ్యంగా పెరుగుతుంది. సాధారణ స్థాయిలో రైతులు ఏర్పాటు చేసే నారు మళ్లలో ఎకరం టమాట సాగుకు సుమారు 80 గ్రా ముల విత్తనం అవసరమైతే.. అదే నర్సరీల్లో ఎకరాకు 50 గ్రాముల టమాటవిత్తనం సరిపోతుంది. రైతులు విత్తనం ఇచ్చిన సమయం నుంచి టమాట 20 నుంచి 25 రోజులు, వంకాయ 40 నుంచి 45 రోజులు, మిర్చి 30 నుంచి 45 రోజులు.. కాలీప్లవర్, క్యాబేజీలు 30 నుంచి 35 రోజుల్లో ఏత దశ కు వచ్చి నారు సిద్ధంగా ఉంటాయి. దీంతో రైతులు పొలాల్లో నారును పోయకుండా నర్సరీల్లోనే పెం చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
కూరగాయ పంటలు సాగు చేసే రైతులకు మంచి నారును అందిస్తున్నా. విత్తనాలను రైతులు కొనుగోలు చేసి ఇస్తే తక్కువ పైసలు తీసుకుంటా. విత్తనం బట్టి డబ్బులను తీసుకుంటున్నా. నర్సరీల్లో పెంచిన నారును సాగు చేస్తే పంటకు ఎలాంటి రోగాలు రాకుండా మంచి దిగుబడులు వస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు నర్సరీల్లోని నారును నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు. -రాజేశ్వరి, నర్సరీ నిర్వాహకురాలు