పరిగి, ఏప్రిల్ 1 : పార్టీలకతీతంగా పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్దికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన పరిగి మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. పరిగి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించిన నిధులతో పనులు పూర్తయితే పట్టణం స్వరూపం మారుతుందని తెలిపారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలన్నారు. అనంతరం పట్టణంలోని గంజ్రోడ్డులో రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.