రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొంతమంది అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి చెరువు, కుంటలకు సైతం ఎన్ఓసీలు జారీచేస్తున్నారు. ఎన్ఓసీలు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుల బఫర్, ఎఫ్టీఎల్లలో సైతం ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎన్ఓసీల జారీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శివారుల్లో ఉన్న ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్, శేరిలింగంపల్లి వంటి మండలాలతోపాటు పెద్దఅంబర్పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, మణికొండ వంటి మున్సిపాలిటీల్లో అనేక చెరువులు, కుంటలున్నాయి. చెరువు, కుంటలున్న భూములు అత్యంత విలువైనవి కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిపై కన్నేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిబంధనలు అతిక్రమించి ఎన్ఓసీలు జారీచేస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు, కుంటల భూములను కాజేసి ప్లాట్లుగా మార్చి రూ.కోట్లకు విక్రయిస్తున్నారు.
– రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ)
ఓవైపు హైడ్రా అధికారులు చెరువు, కుంటలు పరిరక్షిస్తామని చెప్తున్నప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం చెరువు, కుంటలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నా హైడ్రా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ రికార్డుల్లో ఉన్న పలు చెరువులు, కుంటలకు ఎఫ్టీఎల్ హద్దులను అధికారులు ఫిక్స్ చేసినప్పటికీ ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు. అనేక చెరువుల్లోని శిఖం భూముల్లో ప్లాట్లు చేసి భారీ విల్లాలు సైతం నిర్మిస్తున్నారు. తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయాంజాల్ వంటి మున్సిపాలిటీల్లో చెరువు, కుంటలను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి విక్రయిస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు మాత్రం కన్నెత్తి చూడటంలేదు.
కాలువలను పూడ్చివేసి ప్లాట్లుగా..
జిల్లాలో నిజాం కాలం నాటి అనేక చెరువులు, కుంటలున్నాయి. వీటితోపాటు పలు గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేస్తూ కాల్వలను కూడా నిర్మించారు. రెవెన్యూ రికార్డుల్లో చెరువులు, కాల్వలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారుల అండదండలతో ఎన్ఓసీలు తీసుకువచ్చి చెరువు, కుంటలను సైతం మాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిరంగినాలా, పులిందర్వాగు, రావిర్యాల చెరువు వాగులు అతి పొడవైన విస్తీర్ణంలో ఉన్నాయి. కాల్వల ద్వారా చెరువులోకి నీరొచ్చేది. కాలక్రమేణా ఈ వాగులను సైతం పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. రావిర్యాల చెరువు నుంచి ఇందిరాసాగర్ వరకు ఉన్న పులిందర్వాగు ఇరిగేషన్ రికార్డుల్లో కూడా ఉంది. కాని, ఈ వాగును ఎక్కడికక్కడే పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వాగును పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు వాగును ఆక్రమించి వెంచర్లు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా అధికారులు అక్రమంగా ఎల్ఓసీలు కూడా జారీచేస్తున్నారు. ఈ ఎన్ఓసీల ఆధారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు, కుంటలను పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలోని మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లి, అప్పారెడ్డిపల్లి, ఇర్విన్ తదితర గ్రామాల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా చెరువులనే పూడ్చివేసి చెరువులను మటుమాయం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొంగరకలాన్ సమీపంలోని దాతరు చెరువును పూడ్చివేసి సుమారు నాలుగెకరాల చెరువును ఆక్రమించుకున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు వెళ్లే మార్గంలో ఊరచెరువు అలుగు కిందిభాగంలో తరిపొలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. తరిపొలాలకు సైతం ఎన్ఓసీలు జారీచేయడంతో కుంటకట్టలను సైతం పూడ్చివేస్తున్నారు. కొంతమంది అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ ఎన్ఓసీలు పొంది చెరువు, కుంటలను విక్రయించి కోట్లు గడిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.