తుర్కయాంజాల్, మార్చి 27:సాగర్ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణకు నెలకు లక్షల రూపాయాలు వెచ్చిస్తున్నా అవి వెలగడం లేదు. చీకటితో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ కంపెనీకి అప్పగించారు. ప్రతి నెలా సుమారు రూ.8 లక్షల వరకు వీధి దీపాల నిర్వహణకు తీసుకుంటున్న సదరు కంపెనీ మరమ్మతులను పూర్తిగా మరిచింది. ప్రమాదాల నివారణకు ఆర్అండ్బీ, మున్సిపల్, పోలీస్ శాఖ వారు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాగర్ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఇప్పటికైనా అధికారులు వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా తుర్కయాంజాల్ ప్రధాన చౌరస్తాలో వీధి దీపాలు వెలగకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ఆర్అండ్ బీ, మున్సిపల్, పోలీస్ శాఖ వారు దృష్టి సారించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
సాగర్ ప్రధాన రహదారిపై వీధి దీపాలు వెలగడం లేదని ఈఈఎస్ఎల్ సంస్థ దృష్టికి తీసుకెళ్లాం. అయినా స్పందించడం లేదు. సమస్యను సీడీఎంఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
-మల్లికార్జున్, ఏఈ, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ