సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ప్రణాళికాబద్దంగా పట్టణీకరణ జరిగేలా చూడాల్సిన బాధ్యత హెచ్ఎండీఏపై ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నగర శివారులో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు చుట్టూ ఉన్న మండలాలైన కడ్తాల్, కందుకూరు పరిధిలోని గ్రామాల్లో రకరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాజాగా కందుకూరు మండలంలోని నేదునూర్ నుంచి కడ్తాల్ మండల పరిధిలోని రావిచేడు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.రూ.6.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను కూడా ఇటీవల అధికారులు పిలిచారు. ఈ నెల 27వ తేదీలోగా టెండర్లకు గడువు ఇచ్చిన అధికారులు, మొత్తం రోడ్డు నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులే కాకుండా గ్రామాలను కలిపే రోడ్లు కూడా మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ నిధులతో చేపడుతున్నారు.