సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ ) : ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమిషనర్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని, పని తీరు మార్చుకుని లక్ష్యాలను చేరకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా దానకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెలలో ఆరు జోన్ల నుంచి రూ.259.25 కోట్ల టార్గెట్లో ఇప్పటి వరకు రూ. 22.43 కోట్లు మాత్రమే వసూలు చేయడం ఏమిటని దానకిశోర్ ప్రశ్నించారు. వచ్చే రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలోనే 60శాతానికి పైగా వసూళ్లు రాబట్టకపోవడంపై ఆయన ఉన్నతాధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.