తుర్కయంజాల్, జనవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తులను గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 17 వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని స్పష్టం చేసింది. అయితే అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డాటా భద్రమేనా.. ? అది సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో 22,834 దరఖాస్తులు ప్రజాపాలనలో అధికారులకు అందాయి. వాటిని ఆన్లైన్ చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ పాల్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలోని కంప్యూటర్ ల్యాబ్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 37 మంది పనిచేస్తుండగా అందులో సుమారు 20 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఒక్క దరఖాస్తును కంప్యూటరీకరించినందుకు వారికి రూ.15 అందజేయనున్నట్లు సమాచారం. అయితే విద్యార్థులు సెల్ఫోన్లలో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. వివరాల నమోదు క్రమంలో అధికారుల పర్యవేక్షణ లోపించింది. మొబైల్లో మాట్లాడుతూ ఎంట్రీ చేస్తున్న క్రమంలో ఏమైనా తప్పులు దొర్లితే చిన్న తప్పునకు లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అయ్యే అవకాశం ఉన్నది.
ఆన్లైన్ మోసాలకు డాటా వెళ్లే అవకాశం..
సెల్ఫోన్ నంబర్ ఆధారంగా రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగా ళ్ల చేతుల్లోకి ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలు వెళ్తే అనర్థాలు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే దరఖాస్తుల్లో ప్రజల ఆధార్ కార్డుతో పాటు సెల్ఫోన్ నంబర్లను ఎంట్రీ చేశారు. వాటిని సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత కలిగిన వ్యక్తుల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులను కంప్యూటరీకరించాలని ప్రజలు కోరుతున్నారు.