నందిగామ : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఏజెండా చదివి వినిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రల్లె ప్రగతితో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయ న్నారు. గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్లు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంజూరైన సీసీ రోడ్లను సర్పంచ్లు ఎంపీటీసీలు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి, పైపులైన్ లికేజీలు లేకుండా చేసి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ మంజూల, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, రాజునాయక్, కట్న లతా, మాధవి, కళమ్మ, కో-ఆప్షన్ సభ్యులు బేగ్, సర్పంచ్లు కవిత, రాములమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజ్గోపాల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.