నియోజకవర్గంలో 100 కుటుంబాలకు లబ్ధి
ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు అందజేత
నచ్చిన యూనిట్ను ఎంచుకోవచ్చు
నలుగురైదుగురు కలిసి పెద్ద యూనిట్ ఏర్పాటుకు సదావకాశం
రక్షణనిధితో లబ్ధిదారులకు ఆర్థిక ధీమా
నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్, ఫిబ్రవరి 6:‘దళితులు ఆర్థికంగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నారు.. నియోజకవర్గంలో వంద యూనిట్లను ఎంపిక చేశాం..’ అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షలు అందించనున్నట్లు తెలిపారు. వారికి మంజూరు చేసిన డబ్బుల్లోంచి రూ. 10 వేలను రక్షణనిధికి కేటాయించి అత్యవసర సమయాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్ను ఎంచుకోవచ్చని, నలుగురైదుగురు కలిసి పెద్ద యూనిట్ను నెలకొల్పుకునే అవకాశం ఉన్నదని వివరించారు.
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించని విధంగా.. ఎక్కడా అమల్లో లేని పథకాన్ని సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.
నమస్తే : దళితబంధు ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
ఎమ్మెల్యే : దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. రాష్ట్రం లో వెనుకబడిన దళిత కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలువాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక్కో యూనిట్కు రూ.10 లక్షలను ఇచ్చి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను అందజేస్తారు. లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాన్ని చేసుకోవచ్చు.
నమస్తే : లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు.?
ఎమ్మెల్యే : ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక నాలుగు అంచెలుగా సాగుతుంది. ముందుగా గ్రామ, మండల, జిల్లా కమిటీల సభ్యులు సూచించిన విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులా..? కాదా..? అనే విషయాన్ని సంబంధితశాఖ అధికారులు సమగ్రంగా విచారించి నిర్ణయిస్తారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది.
నమస్తే : మీ సెగ్మెంట్లో పథకం అమలు తీరు ఎలా ఉంటుంది?
ఎమ్మెల్యే : ఎక్కడైనా ప్రభుత్వం సూచించిన విధంగా పథకాన్ని అమ లు చేస్తారు. నియోజకవర్గంలోనూ మొదటగా 100 యూనిట్లను ఎంపిక చేశాం. మొదటి విడుతలో 100 యూనిట్లు మంజూరైన అనంతరం రెండో విడుత, మూడో విడుత ఇలా అర్హులందరికీ ఈ పథకం ఫలాలు అందుతాయి. నా అంచనా ప్రకారం నియోజకవర్గంలో సుమారు 20 వేలకు పైగా యూని ట్లు వచ్చే అవకాశం ఉన్న ది. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పు వస్తుంది.
నమస్తే : లబ్ధిదారులు ఎలాంటి వ్యాపారాన్ని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు?
ఎమ్మెల్యే : లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాపారాన్ని ఎంచుకుని ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉపాధి అవకాశాలుంటాయి. అందుకు అనుగుణంగా లబ్ధిదారులు తమ వ్యాపారాన్ని ఎంచుకోవాలి. గ్రామాల్లోని యువకులు వ్యవసాయ యంత్రాలు, ట్యాక్సీ వాహనాలు, కుల వృత్తులకు అనుగుణంగా ప్రయోజనం పొందే సామగ్రిని కొనుగోలు చేసుకోని ఉపాధి పొందొచ్చు. మండల, పట్టణ స్థాయిలో హోటళ్లు, మెడికల్ షాపులు, దుకాణాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళలు కుట్టుమిషన్లు, మ్యాచింగ్ సెంటర్లు, బ్యూటీపార్లర్లను ఎంచుకుని ఆర్థికంగా ఎదుగొచ్చు.
నమస్తే : గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పథకాలు తీసుకొచ్చిందా..?
ఎమ్మెల్యే : నేను గత 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా. గ్రామీణ స్థా యి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అనేక పదవులను చేపట్టా. దళితుల అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. కేవలం సీఎం కేసీఆర్తోనే ఈ పథకం అమలు సా ధ్యమైంది. దళితులు తమ జీవితంలో సీఎం కేసీఆర్ను మరిచిపోరు.
నమస్తే : దళితబంధు రక్షణ నిధితో ఎలాంటి లాభం ఉంటుంది?
ఎమ్మెల్యే : దళితబంధు పథకంతో లబ్ధిదారుడు తాను ఎంపిక చేసుకున్న యూనిట్ల ద్వారా చేసే వ్యాపారంలో ఏమైనా నష్టం జరిగితే ఆపత్కాలంలో దళిత రక్షణనిధి ఆదుకుంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేటాయించే రూ.10లక్షల నుంచి రూ.10వేలను దళిత నిధికి కేటాయించి రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. రక్షణ నిధి ఆయా కుటుంబాలకు ఎంతో ఆర్థిక ధీమానిస్తుంది. భవిష్యత్తులో రక్షణ నిధే ఆయా కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది.
నమస్తే : లబ్ధిదారులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు?
ఎమ్మెల్యే : పేద దళితులు ఈ పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి పొందడంతోపాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. ప్రభుత్వ ఆలోచన దళితులు ఆర్థికంగా బాగుపడాలనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి.