ఆమనగల్లు, మార్చి 24 : నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తా.. మీ ప్రాంత బిడ్డను రాజకీయాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించండి.. అని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆదివారం మాడ్గుల మండలంలోని అప్పరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆర్ఎస్పీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ఎస్పీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందే బీఆర్ఎస్ నాయకులు, బ్లాక్ వాయిస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్ఎస్ ప్రవీణ్కు ఘనస్వాగతం పలికారు.
పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఫిట్నెస్ సెంటర్ను ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రారంభించారు. తదనంతరం సావిత్రిబాయిపూలే గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రామంలో సిలిండర్ పేలి నిరాశ్రయులైన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆర్ఎస్పీ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి ఐపీఎస్ సాధించానని, గురుకుల కార్యదర్శిగా పని చేసి లక్షల మందిని ఉన్నత విద్యావంతులుగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దానన్నారు.
బహుజన వాదం తెలంగాణ వాదం ఒక్కటేనని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానే మారుస్తుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నాయని, ఇలాంటి చర్యలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒడిగట్టడం సమాజహితం కాదన్నారు. తెలంగాణ బ్లాక్ వాయిస్ స్వస్ఛంద సంస్థ చైర్మన్ గోవింద్ శ్రీదర్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఓటర్లు పార్టీలకు అతీతంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, తెలంగాణ బ్లాక్ వాయిస్ స్వస్ఛంద సంస్థ చైర్మన్ గోవింద్ శ్రీదర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లాలయ్య గౌడ్, సురమల్ల సత్తయ్య, కొమ్ము శ్రీనివాస్ యాదవ్, సింగల్విండో డైరెక్టర్ రాజవర్ధన్రెడ్డి, గొర్రె పవన్కుమార్రెడ్డి, జంతుక అల్లాజీ, యాదయ్య, నిరంజన్, బీఆర్ఎస్ యువ నాయకులు పోలె మహేష్, బద్ది రాజు, కొండల్యాదవ్, బ్లాక్ వాయిస్ సభ్యులు కిరణ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.