ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 23 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడితో నియోజకవర్గంలోని పలు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఇబ్రహీంపట్నం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, ఈశ్వరాంజనేయస్వామి ఆలయం, త్రిశక్తి ఆలయంతో పాటు వివిధ గ్రామాల్లోని పలు ప్రముఖ ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఉప్పరిగూడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
షాద్నగర్టౌన్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వేంకటేశ్వరస్వామిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరువైనాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని అర్చకులు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, కౌన్సిలర్లు కానుగు అంతయ్య, ప్రతాప్రెడ్డి, కౌసల్య శంకర్, పలువురు నాయకులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలోని ఆలయాల్లో శనివారం వైకుంఠద్వార దర్శనం పూజలు ఘనంగా సాగాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. భక్తులు తరలివచ్చిన స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంపత్కుమార్గౌడ్, సర్పంచ్ ముద్దం స్వరూప, ఎంపీటీసీ భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : కడ్తాల్, మక్తమాదారం, అన్మాస్పల్లి గ్రామాల్లోని లక్ష్మీచెన్నకేశవస్వామి, వేణుగోపాలస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాలలో ప్రధాన అర్చకులు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ, వింజామూరు రామానుజాచార్యులు, కృష్ణామూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు నరేందర్రెడ్డి, గోపాల్రెడ్డి, రవి, నవీన్, విజయ్, ప్రభాకర్రెడ్డి, నర్సింమ, చెన్నయ్య, లక్ష్మారెడ్డి, మహేశ్, బ్రహ్మచారి, రవిచారి, సాయిప్రభు పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. శనివారం ఉదయం మండలంలోని ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. షాబాద్లోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో స్థానిక సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొన్నారు. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా జరుపుకుంటున్నట్లు వేదపండితులు శ్రీనివాసచార్యులు తెలిపారు.
ఆమనగల్లు : సకల శుభాలను కలిగించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని పలు దేవాలయాలు రంగురంగల విద్యుత్ దీపాలు, అలంకరణతో కళకళలాడాయి. ఆమనగల్లు పట్టణంలోని వెంకటగిరి పద్మావతీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆమనగల్లు పశు వైద్యాధికారి రుద్రాక్షల విజయ్కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మహేశ్, చుక్క నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ :చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటటాడింది. దాదాపుగా 6 వేలకు పై గా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులం దరికీ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి కీర్తనలు, భజనలతో పాటు స్వామి వారి గరుఢ సేవ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ కిష్టయ్య, సర్పంచ్ శైలజ, మాజీ ఎంపీ కొండ వెంకటరంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
యాచారం : మండల కేంద్రంలోని తిరుమలేశుని గుట్టపై వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో కొలువుదీరిన కలియుగదైవం వేంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహానికి పురోహితుడు రాజేశ్ అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. భక్తులు మెట్ల మార్గం ద్వారా అధిక సంఖ్యలో కొండపైకి వచ్చి ఉత్తర ద్వారం ద్వార శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామితో పాటుగా పద్మావతి అలివేలుమంగ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మారోజు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు దండెం రాంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
మొయినాబాద్ : కనకమామిడి గ్రామంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తి కీర్తనలు ఏర్పాటు చేశారు. అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారి పార్థసారథి దంపతులు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేర్రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్కనం స్వామి వారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీ కొండ ఆలయానికి రూ. 5 లక్షలు విరాళం అందించారు.
నందిగామ : మండల కేంద్రంలోని శివరామ ఆంజనేయస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, ఎంపీటీసీ చంద్రపాల్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
చిలుకూరు బాలాజీకి పోటెత్తిన భక్తులు
మొయినాబాద్ : మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న వేంకటేశ్వర ఆలయానికి (చిలుకూరు బాలాజీ) భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. ఉత్తర ద్వారం లేకపోయిన వైకుంఠ ఏకాదశి రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.