షాబాద్, మార్చి 17: ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సతీమణి సీతా రంజిత్రెడ్డి అన్నారు. త్వరలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని బాలికల పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలోని బండ్లగూడ, శంకర్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం ఈ మిషన్స్ ప్రారంభం చేసి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు.
అనంతరం బాలికలకు రుతుస్రావంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీతా రంజిత్రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ జీవిత కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన రుతుస్రావం(పీరియడ్స్)పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు, మహిళా ప్రతినిధులు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అధినేత రీతూ, డాక్టర్ శ్వేత పాల్గొన్నారు.