కొడంగల్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్తోనే ప్రజలకు భరోసా ఏర్పడుతుందని సబ్బండ వర్ణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్ మండలంలోని రుద్రారం గ్రామంలో 15 గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అథితులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే పల్లె, పట్టణాలు అభివృద్ధిని సాధించి నేడు స్వచ్ఛతలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ప్రతి వర్గాన్ని అభ్యున్నతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారన్నారు.
గడిచిన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గం ఆనుకొని ఉన్న కర్ణాటక ప్రాంత వాసులు తెలంగాణ ప్రజలు అదృష్టవంతులని, మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యంగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు అధికారాన్ని కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు.
మత కలహాలను సృష్టించి బీజేపీ అధికారంలోకి రావడానికి దుర్మార్గపు ఆలోచన చేస్తుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ తెలంగాణకు రావాల్సిన నిధులను అడ్డుకొంటున్నట్లు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ.. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. గత పాలకుల హయాంలో వేసవి కాలం వచ్చిందంటే తాగునీటికి ఖాళీ బిందెలతో పరుగులు తీయాల్సి వచ్చేదని, నేడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేస్తుందని గుర్తు చేశారు. సాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు సాగనీయకుండా కేసులు వేసి అడ్డుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో కొడంగల్ ప్రాంతం సస్యశ్యామలంగా మారనున్నట్లు ఎంపీ తెలిపారు.
తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. నేడు సీఎం కేసీఆర్ దేశానికి తెలంగాణను ఓ రోల్ మాడల్గా నిలబెట్టారని తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయడం ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత గ్రామాలు, పట్టణాల, తండాల రూపురేఖలు మారాయని చెప్పారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను అడ్డుకొంటూ సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న చమురు ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారని పేర్కొన్నారు. నేడు ప్రతి తండా, గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యాలు ఏర్పాడ్డాయని, ఎక్కడికైనా సురక్షితంగా ప్రయాణాలు చేసే అవకాశం ఏర్పడిందన్నారు.
రేవంత్రెడ్డి రెండు పర్యాయాలు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారని, ఎన్నికల సమయం రావడంతో ఇప్పుడు ప్రజా సంక్షేమం గుర్తుకు వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. అప్పట్లో ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే వేలకు వేలు ఖర్చు చేసుకొని హైదరాబాద్కు వెళ్లి ఆయన ఇంటి ముందు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. రేవంత్రెడ్డివి మాటలే తప్ప చేతలు చేతకావని, ఎప్పుడూ అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచనే తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. 4 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గం అన్నింటా అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతున్నదన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వందల కోట్ల నిధుల మంజూరుతో అభివృద్ధిని పనులు జరిపించినట్లు తెలిపారు.
కొడంగల్లో ప్రతి సంవత్సరం రూ.100కోట్లు రైతు బంధు అందుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు పరిమితమైయ్యే నాయకుడు కావాలా.. ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉండే నాయకుడు కావాలో ప్రజలు గుర్తించుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవని, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీ నేతల ఉనికిని చాటుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను నమ్మకుండా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్నరోజుల్లో పెద్ద మొత్తంలో దళితబంధు పథకం అమలు కావడంతో పాటు 2వ విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, త్వరలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.