బీసీలు చైతన్యం చాటే సమయం ఆసన్నమైందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఓట్లు మావే.. గెలుపు మనదే.. నినాదంతో చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ముందుకు సాగుదామని నేతలు పిలుపునిస్తున్నారు. వెనుకబడిన వర్గంగా ముద్ర వేసుకుని రాజకీయంగా వెనుకబడిపోవద్దని సూచిస్తున్నారు. రాజ్యాధికారం ఉంటేనే సబ్బండ వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని వారు వివరిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎదురైన కష్టాలు, నష్టాలను కండ్లారా జూశామని.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీలకతీతంగా ఓట్లు వేసి గెలిపించుకుందామని చెబుతున్నారు. బీసీల శక్తి, చైతన్యం అంటే ఎట్లుంటదో రుజువు చేసేందుకు ‘కాసాని’ రూపంలో వచ్చిన అవకాశాన్ని బీసీలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
– రంగారెడ్డి, మే 2(నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో 96 కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలపై పోరాటం చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కు దక్కుతుంది. అలాంటి నాయకుడిని గుర్తించిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప పరిణామం. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాసాని ఎంపీగా గెలవాల్సిందే. బీసీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తాం.
– ప్రమోద్, బిల్కల్, మర్పల్లి
బడుగు బలహీన వర్గాలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. బీసీల గళం వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన కాసానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆ వర్గాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
– అంజయ్యగౌడ్, రావులపల్లి, మర్పల్లి
బీఆర్ఎస్ అభ్యర్థి, బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ 50 శాతం సీట్లు కేటాయించడం సంతోషకరం. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి అనుభవం ఉన్న కాసానిని చేవెళ్ల ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– నక్క శ్రీనివాస్గౌడ్, బీసీనేత, షాబాద్
చేవెళ్ల గడ్డపై బీసీల సత్తా ఏంటో చూపెట్టాలి. గత 40 ఏండ్లుగా బీసీల సమస్యలపై పోరాటం చేస్తూ, 96 కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. అలాంటి నాయకుడిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్కు ధన్యవాదాలు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 50 శాతం మంది బీసీ ఓటర్లే ఉన్నారు.
– గాదం సత్తయ్య, బీసీ నాయకుడు, షాబాద్
బడుగు వర్గాల నేత, మాజీ సీఎం బలపర్చిన కాసాని జ్ఞానేశ్వర్ గారికే మా ఓటు. ఈ ప్రాంత ప్రజల బాగోగులు తెలిసిన నేత, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలవడం ఖాయం. గతంలో ఈ పార్టీపై గెలిచిన నేత మరో పార్టీకి వెళ్లడం దురదృష్టకరం. ఆయన రాజకీయానికి నూకలు చెల్లినట్టే.. మాజీ సీఎం కేసీఆర్కు ఉన్న పట్టుదల మన రాష్ట్ర అభివృద్ధిలో ఎవ్వరికీ లేదు.
– రంగారెడ్డి, ప్రేమావతిపేట, రాజేంద్రనగర్ నియోజకవర్గం
తెలంగాణ బాధలు తీరాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలూ సక్రమంగా అమలులో లేవు, ప్రస్తుతం అంతా గడ్డు కాలం వచ్చేసింది. సీఎం రేవంత్రెడ్డికి పాలించే సత్తా లేదు, ఓట్ల కోసం ఆయన ఊర్లలో మాయమాటలు చెబుతున్నారు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
– దస్తగిరి, గుత్తేదార్, శాస్త్రీపురం, రాజేంద్రనగర్ నియోజకవర్గం
ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ బలపరచిన బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీ అందించి బీసీల సత్తా చాటుతాం. బీసీలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలు ఏకమై అగ్రవర్ణాల రాజకీయ నాయకులను గతంలో గెలిపించుకుంటే వారి వల్ల బీసీలకు ఎలాంటి లాభం జరుగలేదు.
– మల్లేశం, మాజీ సర్పంచ్, హాజీపూర్, యాలాల మండలం
తెలంగాణవ్యాప్తంగా 6 సీట్లలో బీసీలకు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. పార్టీలకతీతంగా బీసీలందరూ ఏకమై చేవెళ్లలో గెలుపు బావుటా ఎగురవేసి కాసాని జ్ఞానేశ్వర్ను పార్లమెంటుకు పంపుదాం. కాసానిని గెలిపించుకుంటేనే బీసీల్లోని అన్ని కులాలకు సముచిత న్యాయం జరుగుతుంది. బీసీల సత్తా చూపిస్తాం. చేవెళ్ల గడ్డపై బీసీల ఐక్యత చాటుతాం.
– తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, యాలాల మండలం
బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కు పట్టం కడుతాం. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు కనీసం రైతు బంధును కూడా వేయలేకపోతున్నది. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు ఉంటుంది. కాసానిని ఎంపీగా గెలిపించుకుంటాం.
– బుచ్చయ్య, జేఏసీ కో కన్వీనర్, కులకచర్ల మండలం
బీఆర్ఎస్తోనే దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేందుకు గత ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు వంటి మంచి పథకాలను ప్రవేశపెట్టింది. కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు బంధు, దళిత బంధు రెండు కూడా బందు అయ్యాయి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కు పట్టం కడుతాం.
– వెంకటయ్య, దళిత యువశక్తి యువజన సంఘం మాజీ అధక్షుడు, కులకచర్ల
బీసీలు ఓట్లు కాసే చెట్లు కాకూడదు. మన ఓట్లు మనమే వేసుకుందాం. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించుకుందాం. బీసీ ఉద్యమ నేతకు బాసటగా నిలబడుదాం. బడుగు బలహీన వర్గాలను ఏకం చేద్దాం. పార్లమెంట్లో బడుగుల గళం వినిపించాలంటే కాసానిని గెలిపించుకుందాం. బీసీలకు అవకాశాలు రావడం అరుదు.
– జమాల్పూర్, ఆరె కటిక సంఘం రాష్ట్ర సలహాదారు
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి బీసీ ఇంటి గడపను తడుదాం. ఓటర్కు దండం పెట్టి బీసీకి ఓట్లు వేద్దామని కంకణబద్దులమై పనిచేద్దాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను విస్మరించారు. వారికి బుద్ధి చెప్పాలంటే కాసానిని గెలిపించుకోవడం ముఖ్యం. అందరం ఒక్కటై చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీసీ రాజ్యాధికార బావుటా ఎగురవేద్దాం.
– జహంగీర్జీ, ఆరె కటిక సంఘం ఉపాధ్యక్షుడు
బీసీల పక్షాన పోరాడే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్లో బీసీల గొంతుకను వినిపిద్దాం. స్వార్థ రాజకీయాలతో తమ ప్రయోజనాలను చూసుకునే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు బుద్ధి చెప్పేలా అన్ని వర్గాల ప్రజలు ఏకమై బీఆర్ఎస్ను గెలిపించాలి. కాసాని గెలుపుతో బీసీల ప్రాధాన్యత పెరుగుతుంది.
– ఉప్పటూరి మధుకుమార్, చందానగర్
బూటకపు హామీలతో గెలిచిన కాంగ్రెస్ను ఖతం పట్టించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు ఖాయం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏండ్లుగా పోరాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. కేసీఆర్కు కానుకగా అందిద్దాం.
– కోటా సతీష్, చందానగర్