సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సీఎన్జీ వినియోగదారులపై ఆటోవాలాలపై కేంద్రం అదనపు భారం మోపింది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు మరలగా ఇప్పుడు సీఎన్జీ ధరలు సెంచరీకి చేరువ కావడంతో లబోదిబోమంటున్నారు. కొద్దిరోజుల కిందట రూ.85 ఉండగా.. సరిపడా సరఫరా లేకపోవడంతో కిలో సీఎన్జీ రూ.94కు చేరింది. మరోరెండుమూడు రోజుల్లో సెంచరీకి చేరే అవకాశం కనిపిస్తున్నది. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంతో వాహనదారులు సీఎన్జీ వినియోగానికి మళ్లితే.. పెరిగిన ధరలతో మళ్లీ వెనక్కివెళ్లే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, గ్యాస్తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలోకు 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఫలితంగా నో స్టాక్ బోర్డులతో బంకులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మారెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460పైగా పెట్రోల్ బంకులు ఉండగా, 72 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి.
నోగ్యాస్..!!
పెట్రోల్తో నడిచే వాహనాలకు సీఎన్జీ కిట్ ఉన్నా ప్రత్యామ్నాయంగా పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. అదే డీజిల్తో నడిచే వాహనాలకు ఈ సదుపాయం ఉండదు. ఒక్కో కిట్ కోసం వాహనదారులు రూ.20వేల నుంచి 40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో సీఎన్జీ బంకులకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బీజీఎల్) కంపెనీ గ్యాస్ సరఫరా చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఒక్క ఆటోలో 4 కిలోలు, కారులో 9 కిలోల వరకు సీఎన్జీ నింపొచ్చు. కిలోకు 30 కిలోమీటర్లు లెక్కెస్తే ఒక్కో ఆటోకు రోజులో ఫుల్ట్యాంక్ అయిపోతుంది. ఒక్కో బంకులో 2వేల కేజీల వరకు అమ్ముతున్నారు. వచ్చిన కాసేపటికే గ్యాస్ అయిపోతుండటంతో వాహనాలు క్యూ కడుతున్నాయి. మహా నగరంలో సుమారు మూడు నాలుగు లక్షల వాహనాలు సీఎన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్ను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్కు కొరత లేనప్పటికీ సీఎన్జీ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది.