సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన వైద్య బృందం ఇటీవలే రోబో ద్వారా సర్జరీలు చేయడం ప్రారంభించింది. తాజాగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు సైతం రోబో వచ్చేసింది. ఇప్పటికే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 7 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రాగా, రోబో థియేటర్ సైతం సిద్ధమైంది. దీంతో తెలంగాణలోని ప్రభుత్వ రంగ దవాఖానల్లో ఇక నుంచి రోబో శస్త్రచికిత్సల సంఖ్య మరింత పెరగనున్నది. దీని వల్ల నిరుపేద రోగులకు కార్పొరేట్ను తలదన్నే వైద్యం అందనున్నది.
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రస్తుతం ప్రతి రోజూ 8నుంచి 10 శస్త్రచికిత్సలు జరుగుతుండగా వాటిలో ఒకటి లేదా రెండు మేజర్ సర్జరీలు చేస్తున్నారు. రోబో అందుబాటులోకి వస్తే మేజర్ సర్జరీల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పుడు రోజుకు ఒకటి రెండు జరిగే ప్రధాన శస్త్రచికిత్సలు చేస్తుండగా, రోబో అందుబాటులోకి వస్తే.. నాలుగైదు మేజర్ సర్జరీలు చేసే వీలుంటుంది. దీంతో పెద్ద ఆపరేషన్ల కోసం వేచి చూసే రోగులకు నిరీక్షణ కాలం తప్పుతుంది. అంతేకాకుండా శస్త్రచికిత్సల సంఖ్య కూడా ప్రతి రోజూ 10 నుంచి 20 వరకు జరిగే అవకాశాలుంటాయని, దీని వల్ల క్యాన్సర్ సర్జరీలు మరింత వేగవంతంగా చేయవచ్చని వైద్యులు తెలిపారు. రోబో ద్వారా క్యాన్సర్ రోగులకు క్లిష్టమైన సర్జరీలను సులువుగా చేయవచ్చంటున్నారు.
రోబోతో ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా ఎంతటి పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ రోగులకు సాధారణ పద్ధతిలో శస్త్రచికిత్స చేయడం కొంత క్లిష్టమైనదే కాకుండా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే రోబోతో అయితే సులువుగా చేయవచ్చు. పొట్ట, ఛాతీ, లివర్ తదితర భాగాల్లో ఎంతటి క్లిష్టమైన సర్జరీలనైనా సులభంగా జరపవచ్చు. రోబో సులువుగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. క్లిష్టమైన సర్జరీలు సులువుగా చేయవచ్చు. కడుపునకు సంబంధించిన అన్ని రకాల సర్జరీలు అంటే గాల్ బ్లాడర్, పాంక్రియాస్, చిన్న, పెద్ద పేగులు, కిడ్నీ, రెక్టమ్ తదితర శస్త్రచికిత్సలను కూడా ఈ రోబో ద్వారా చేయవచ్చు.
ఎంఎన్జేలో మూడు నెలల కిందట మాడ్యులర్ థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక్కడ గతంలో కంటే శస్త్రచికిత్సల సంఖ్య పెరిగింది. ప్రతి రోజూ 8 నుంచి 10సర్జరీలు చేస్తున్నాం. అందులో ఒకటి రెండు మేజర్ సర్జరీలు ఉంటున్నాయి. వారం క్రితమే రోబో కూడా వచ్చేసింది. ఇది కూడా నిమ్స్ తరహా ఆధునిక రోబోనే కావడంతో క్లిష్టమైన సర్జరీలను సులభంగా చేయవచ్చు. రోబో వల్ల మేజర్ సర్జరీల సంఖ్య పెరుగుతుంది. అంటే ప్రతి రోజూ నాలుగైదు మేజర్ సర్జరీలు చేయవచ్చు. అంటే రోజుకు 10 నుంచి 15 శస్త్రచికిత్సలు చేసే వీలుంటుంది. రోబో ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి 20 మంది సర్జన్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
-డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్