తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలో గురువారం కల్వకుర్తి నియోజకవర్గ విసృత్త స్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ ప్రతి పది గ్రామాలకో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మోదీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అన్నారు.
ఆమనగల్లు, మార్చి 23: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఆలేటి నారాయణ ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన జరిగింది.
దీనికి ముఖ్యఅతిథులుగా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్సీ వాణీదేవి, నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల మరణించగా.. మార్చి 23న ఆయన జయంతి కావడంతో చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి కొద్ది సేపు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
దాదాపు తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్పై ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని పది గ్రామాలకొక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్నారు. ఉద్యమకారులు, క్రియాశీల సభ్యులు, బీఆర్ఎస్ కు టుంబ సభ్యులు, ప్రతినిధులు ఈ సమ్మేళనాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని కొనియాడారు. నియోజకవర్గంలో 1100 మందికి దళితబంధు , నాలుగు వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని అందించనున్నట్లు వివరించారు. జీవోలు 58, 59 ద్వారా ప్రభుత్వ భూమిని గుర్తించి ఇండ్ల స్థలాలను అందిస్తామన్నారు.
నియోజకర్గంలో పార్టీకి 60 వేల వరకు క్రియాశీల సభ్యులున్నారని.. వారే పార్టీకి బలమన్నారు. ఒక్కో ఆత్మీయ సమ్మేళనాన్ని మూడు నుంచి నాలుగు వేల మందితో నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనాల వివరాలను తేదీలవారీగా వివరించారు. అనంతరం బాలాజీసింగ్, శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసిమెలిసి ముందుకు సాగితే కల్వకుర్తిలో బీఆర్ఎస్ జెండాఎగురడం ఖాయమన్నారు.
అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అనురాధ, విజితారెడ్డి, దశరథ్నాయక్, మా జీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ ,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అర్జున్రావు, శంకర్నాయక్, జైపాల్రెడ్డి, రవీందర్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, నిట్టనారాయణ, కడ్తాల్ సర్పంచ్ రెడ్డి, రాధమ్మ, సుభాశ్, రమేశ్, నిరంజన్ గౌడ్, సయ్యద్ ఖలీల్, కిరణ్, రమేశ్, అల్లాజీ ,గిరి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మనుగడ కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ మతతత్వ రాజకీయాలు చేస్తున్నదని.. భాజపేతర రాష్ర్టాలపై ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ మండిపడ్డారు. గురువారం ఆయన ఆమనగల్లు పట్టణంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పి ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారన్నారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నరన్నారు. రైతులను విస్మరించి.. అదానీ, అంబానీ, నీరవ్మోదీలకు రూ. లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని విమ ర్శిం చారు. 2014లో రూ.17 వేల కోట్లు ఉన్న అదానీ ఆస్తులు బీజేపీ హయాంలో రూ. 23 లక్షల కోట్లకు ఎలా పెరిగాయని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రైతులకు ఎంఎస్పీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలను అమలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారన్నారు. రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ విపక్ష పార్టీలను అస్థిర పర్చేందుకు ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోనలేకనే ఆయన్ను లొంగదీసుకునేందుకు ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ మద్యం కేసులో అక్రమ కేసులు పెట్టి ఈడీతో గంటల తరబడి విచారణ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, అర్జున్రావు,పత్యానాయక్ పాల్గొన్నారు.