బడంగ్పేట, ఏప్రిల్ 28 : సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చందన చెరువుకట్టపై ఆదివారం ఆమె ఉదయం నడకలో వాకర్స్ను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి కట్టుబడి పనిచేసేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. హామీల అమల్లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంట్ కష్టాలు పెరిగాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేదన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మీర్పేట వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేశ్గౌడ్, కార్పొరేటర్లు భూపాల్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.