వికారాబాద్/నవాబుపేట, మే 4: అబద్ధాల కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం 5 నెలల్లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు నవాబుపేటకు వచ్చేవన్నారు. 6 గ్యారెంటీలంటూ కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచిందన్నారు. అమలుకాని హామీలు, ముఖ్యంగా డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ప్రజలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేశారన్నారు.
కాగా, ఎన్నికలముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను సబితారెడ్డి తన ఫోన్ నుంచి ప్రజలకు వినిపించారు. కాంగ్రెస్ పాలనలో పింఛన్లు 26వ తేదీన వస్తున్నాయని, అదే కేసీఆర్ హయాంలో 5వ తేదీ లోపే వచ్చేవన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4వేల పింఛన్ వంటి గ్యారెంటీలు అమలు చేయకపోవడంపై నిలదీయాలన్నారు. ఎన్నికల హామీ అయిన మహిళలకు రూ.2500 చొప్పున ఆర్థికసాయం అందిస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పాలన్నారు. వెళ్లిన ప్రతిచోటా దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్న రేవంత్రెడ్డికి గుణపాఠం చెప్పాలన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో అన్నివర్గాల ప్రజలు దర్జాగా బతికారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలతో కలిసి ఎన్నో ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించారన్నారు. అధికారం చేపట్టాక తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారన్నారు. కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చి తాగు, సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారన్నారు. ఎవరు అడుగపోయినా రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేశారన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ట్రాక్టర్లు, శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు తదితర మౌలిక వసతులు కల్పించారన్నారు. చేవెళ్ల ఎంపీగా బీసీ బిడ్డ కాసానిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుగా ఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లో పెట్టడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్ వెంటనే జనం ఉన్నారని నిరూపించాలన్నారు. బీసీ నాయకుడు కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు దయాకర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, ఎంపీటీసీలు విజయ్, చారి, మాజీ సర్పంచ్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఎంపీగా పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. బీసీల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేస్తున్నానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నవాబుపేట బస్టాండ్ వద్ద కళాకారులు నిర్వహించిన ఆటపాటలు అలరించాయి. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో నవాబుపేట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా డప్పు చప్పుళ్లు, డీజేలు, బాణ సంచాలు కాలుస్తూ సమావేశానికి తరలివచ్చారు. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం దద్ధరిల్లింది.