మోమిన్పేట, నవంబర్ 25: బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళతబంధు వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం మండల పరిధిలో బాల్రెడ్డి గూడ, చీమలదరి, దేవరంపల్లి, చక్రంపల్లి, ఎన్కతల, టేకులపల్లి, మక్తతండా, మోమిన్ పేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ వారి వారెంటీ లేని ఆరు గ్యారెంటీలు మనకొద్దన్నారు. గత అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తు చేసుకోవా లన్నారు.
కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే తెలంగాణ అభివృద్ధి గ్రామాల్లో కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నదన్నారు. మారుమూల గ్రామాల్లో తాగు నీటి సౌకర్యం కల్పించడం ఏ నాయకుడితో కూడా సాధ్యం కాలేదన్నారు. కేవలం సీఎం కేసీఆర్తోనే అది సాధ్యమైందన్నారు. గాలిమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధికి నోచుకోదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు హరి శంకర్, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.