ఇబ్రహీంపట్నం/యాచారం, జనవరి 22 : ఎనిమిదేండ్ల పాలనలో రూ.2,391కోట్ల నిధులతో నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) చేపట్టిన ప్రగతి నివేదన యాత్రను యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శంఖం పూరించి ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని నందీశ్వరక్షేత్రంలో నంది, శివలింగానికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ప్రగతి నివేదన యాత్ర ప్రారంభ సభను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సభకు నియోజకవర్గం నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. జెండాలు, కటౌట్లతో గులాబీమయమైంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడానికి, ప్రధాన సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి ప్రగతి నివేదన యాత్రను మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి చేపట్టినట్లు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమతులు తీసుకునే పాదయాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పాదయాత్ర ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కూడా దోహదపడుతుందన్నారు. పాదయాత్రతో గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం తనకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి రూ.5కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ప్రశాంత్కుమార్రెడ్డి దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులను కేటాయిస్తామన్నారు. ఈ నెల 29 నుంచి ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో మార్నింగ్ వాక్ ద్వారా అన్ని వార్డుల్లో పర్యటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
మేజర్ గ్రామాల్లో నిర్వహించే పాదయాత్రకు మంత్రులు, పార్టీ ప్రతినిధులు హాజరవుతారన్నారు. 9 రోజులపాటు యాచారం మండలంలో పాదయాత్ర ఉంటుందని.. ఫిబ్రవరిలో పాదయాత్ర మంచాల మండలంలోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలో 60 రోజులు 79 గ్రామాలు, 80 మున్సిపల్ వార్డుల్లో పాద యాత్ర కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.2391 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో 7 సబ్స్టేషన్లతో లోఓల్టేజీ సమస్య ఉండేదని, సమస్య పరిష్కారానికి నియోజకవర్గంలో 23 నూతన సబ్స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 118 కి.మీ ఆర్అండ్బీ రోడ్లు, రూ.15కోట్లతో 36 కి.మీ కాలువల నిర్మాణాలు చేపట్టామన్నారు. రూ.513 కోట్లతో రైతు బంధు, 33 కోట్లతో రైతు బీమాను అందించినట్లు తెలిపారు.
4 సంవత్సరాల్లో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా 386 మంది పోలీస్ ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. మరో 800 మంది నూతనంగా సెలక్ట్ అయినట్లు తెలిపారు. టెట్, డీఎస్సీ కోచింగ్ ఇచ్చి నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తాళ్లపల్లిగూడలో 400 ఎకరాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మండలంలో రూ.2 కోట్ల పైచిలుకుతో సెంట్రల్ లైటింగ్, సబ్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో నుంచి రూ.5 కోట్లను నందివనపర్తి గ్రామాభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. ఫార్మాసిటీలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. నియోజకవర్గ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి రోజుకో వేషం వేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని అతడు ఐదేండ్లకోసారి ఎన్నికల ముందు వస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికే ముచ్చటగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పినట్లు తెలిపారు. అవినీతికి మారు పేరు మల్రెడ్డి రంగారెడ్డి అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, నగర పంచాయతీ చైర్పర్సన్లు స్రవంతి, స్వప్న, వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ, ఎంపీపీలు కృపేశ్, నర్మద, డీసీసీ వైస్ చైర్మన్ సత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మున్సిపల్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, జంగయ్య, సర్పంచ్ ఉదయశ్రీ, బీఆర్ఎస్ నాయకులు శేఖర్రెడ్డి, కృష్ణగౌడ్, ప్రభాకర్, రాంరెడ్డి, రాజునాయక్, తలారి మల్లేశ్, రమేశ్, రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నందివనపర్తి గ్రామాభివృద్ధికి రూ.4.83 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద ఫార్మాసిటీని 1900 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫార్మా రాకతో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.45 కోట్లతో యాచారం నుంచి నందివనపర్తి మీదుగా మీర్ఖాన్పేటకు డబుల్ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఉండి యాచారంలో మైనింగ్ను వ్యతిరేకించి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో లోయపల్లి, శివన్నగూడ రిజర్వాయర్లు అభివృద్ధికి నోచుకోలేదని.. త్వరలో అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తండ్రి ఆస్తికి మాత్రమే వారసుడిని కాదని, ఆయన ఆశయాలు, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను పాదయాత్ర చేస్తున్నానని, పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. పాదయాత్రను రాజకీయ కోణంలో చూడవద్దని.. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడానికే పాదయాత్ర చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం ప్రశాంత్రెడ్డి నందివనపర్తిలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
ఫార్మాసిటిపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారంలో అర్థంలేదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి, మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి అన్నారు. ఫార్మా భూనిర్వాసితులకు ఎకరాకు 121గజాల ఇంటి స్థలాన్ని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని.. ఫార్మాను వ్యతిరేకించే బీజేపీ నాయకులు చేతనైతే సెంట్రల్కు వెళ్లి ఆపుకోవాలన్నారు. ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఫార్మాసిటీ ఆగే ప్రసక్తే లేదన్నారు.