యాచారం, మార్చి 17: వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, కూరగాయల తోటలను శుక్రవారం ఆర్డీవో వెంకటాచారితో కలిసి పరిశీలించారు. వడగండ్ల వర్షానికి గాయాలపాలైన వారిని పరామర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న ఇండ్లు, పంటల పూర్తి స్థాయి జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి నష్టపోయిన గిరిజనులకు తక్షణ సహాయాన్ని అందించాలని ఫోన్ ద్వారా మాట్లాడారు. సుమారుగా 600లకు పైగా పెంకుటిండ్లు ధ్వంసం కావడం బాధాకరమన్నారు.
450 ఎకరాల్లో వివిధ రకాల పంటలు, 20 ఎకరాల్లో కూరగాయల తోటలు నష్ట పోయినట్లు తెలిపారు. 3 కోళ్ల ఫారాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సుమారు 8000 కోడి పిల్లలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందిస్తామన్నారు. తక్షణమే ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయించారు. అనంతరం ఆర్డీవో వెంకటాచారి మాట్లాడుతూ.. గ్రామంలో తక్షణ సహాయక చర్యలను రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం నష్ట పోయిన వరి, మామిడి, డ్రాగన్ఫ్రూట్ పంటను, కోళ్ల ఫారాలను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, అగ్రికల్చర్ ఏడీఏ సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులందరినీ ఆదుకుంటాం
మంచాల : వడగండ్ల వానతో పంటనష్ట పోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి నష్ట పోయిన పంటలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. బోడకొండ, ఎల్లమ్మతండా, లోయపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని, రైతులు అధైర్య పడవద్దని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, సర్పంచ్ అలివేలు, మాజీ సర్పంచ్ కస్నానాయక్, నాయకుడు వనపర్తి బద్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.