కడ్తాల్, జనవరి 17 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభంకాగానే ఎంపీటీసీలు, సర్పంచ్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశానికి కొంతమంది అధికారులు సమయపాలన పాటించడం లేదని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దెలకుంటతండా, జమ్ములబావితండా, రావిచేడ్, కడ్తాల్ గ్రామాల్లో మిషన్ భగీరథ గ్రిడ్ మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ పోతుగంటి శంకర్, ఎంపీటీసీలు గోపాల్, శ్రీనివాస్రెడ్డి సభలో ప్రస్తావించగా… వారం, పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని డీఈఈ సందీప్ పేర్కొన్నారు. తమ పదవికాలం పూర్తి కావొస్తున్నా సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడంలేదని, విధుల నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వైస్ ఎంపీపీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో వ్యవసాయానికి, గృహాలకు అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తున్నారని పలువురు సర్పంచ్లు సభలో లేవనెత్తగా.. ప్రభుత్వం మారగానే మార్పు వచ్చిందని సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలో భూ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందడంలేదని జడ్పీటీసీ దశరథ్నాయక్ ప్రశ్నించారు. ముద్విన్ గ్రామంలో రాత్రివేళల్లో ఇసుక మాఫియా వాగుల్లో నుంచి ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారని సర్పంచ్ యాదయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల పరిధిలోని సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. వారికి అధికారులు సమాధానం చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఎన్నికలయ్యాక గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో కరెంట్ కోతలు లేకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే 95 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని చెంచు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవద్దని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు.
చరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.15 లక్షలు, ఎంపీటీసీ, కోఆప్షన్ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీలు లచ్చీరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, రాములుగౌడ్, మంజుల, ఉమావతి, నిర్మలమ్మ, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, యాదయ్య, సుగుణ, భాగ్యమ్మ, రాములు, పాండు, సీఐ శివప్రసాద్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, ఎంఈవో సర్దార్నాయక్, పశువైద్యాధికారి భానునాయక్, ఎంపీవో మధుసూదనాచారి, ఏవో శ్రీలత, ఏఈలు పరమేశ్, నరేందర్, నిఖిల, శ్రావ్య, నోడల్ అధికారి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.